న్యూఢిల్లీ, జూన్ 11 : ఈనెల 4న నైరుతి రుతు పవనాలు కేరళ తీరాన్ని తాకిన తర్వాత.. వాటి ఉధృతి దేశవ్యాప్తంగా మారింది. రుతు పవనాల రాక ఈసారి చాలా బలంగా ఉన్నప్పటికీ.. దేశవ్యాప్తంగా వాటి పురోగతి అనుకున్నంతగా లేదు. దక్షిణ, ఈశాన్య భారతదేశంలోని చాలా ప్రాంతాలపై వేగంగా దూసుకెళ్లిన రుతు పవనాలు.. అటు తర్వాత క్రమంగా నెమ్మదించాయి. ప్రారంభ వేగం తర్వాత దేశవ్యాప్తంగా రుతు పవనాల కదలికలు మందగించాయి. దేశంలోని మధ్య, పశ్చిమ, వాయవ్య ప్రాంతాలు ఇప్పటికీ ‘నైరుతి’ వర్షాల కోసం ఎదురుచూస్తున్నాయి.
అరేబియా సముద్రం, బంగాళాఖాతంలో అల్పపీడన వ్యవస్థలు, వాయుగుండాలు, తుఫానులు చాలాకాలంగా ఏర్పడకపోవటం ప్రధాన కారణమని ప్రైవేట్ ఏజెన్సీ ‘స్కైమెట్’ తెలిపింది. దీని ఫలితంగా ప్రస్తుతం నైరుతి రుతు పవనాల పురోగతి నెమ్మదిగా, అసమానంగా ఉందని ‘స్కైమెట్’ అంచనా వేసింది. అరేబియా, బంగాళాఖాతంలో వాతావరణ వ్యవస్థలు నైరుతి రుతు పవనాల పురోగతికి ముఖ్యమైన చోదకాలుగా పనిచేస్తాయి. భారత భూభాగమంతటా రుతుపవనాల కదలికలను వేగవంతం చేయగలవు.