Southwest Monsoon | నైరుతి రుతుపవనాలపై భారత వాతావరణ శాఖ కీలక సమాచారం వెల్లడించింది. నైరుతి రుతుపవనాలు ఆదివారం దక్షిణ బంగాళాఖాతం మీదుగా అండమాన్ నికోబార్ దీవులను తాకాయని హైదరాబాద్ ఐంఎండీ తెలిపింది. రుతుపవనాలు మాల్దీవులు, కొమోరిన్ ప్రాంతాల్లోనూ సమయానుకూలంగా పురోగమించాయని వాతావరణ శాఖ తెలిపింది. గతేడాది నైరుతి రుతుపవనాలు మే 19న భారత భూభాగాన్ని తాకాయి.
రుతుపవనాల పురోగతి, ప్రారంభాన్ని పరిగణనలోకి తీసుకోవడానికి ఐఎండీ కొన్ని ప్రమాణాలను అనుసరిస్తుంది. ఐఎండీ ప్రకారం.. దిగువ ట్రోపోస్పిరిక్ స్థాయిలో (3 కిలోమీటర్ల వరకు) కొలిచే పశ్చిమ గాలుల బలం దాదాపు 20 నాట్స్కి పెరిగింది. ఈ ప్రాంతంలో సగటు సముద్ర మట్టానికి 4.5 కిలోమీటర్ల ఎత్తు వరకు నైరుతి గాలులు వీచాయి. మేఘాలు సైతం పెరిగాయి. ఈ ప్రాంతంలో అవుట్గోయింగ్ లాంగ్వేవ్ రేడియేషన్ (OLR) చదరపు మీటరుకు 200 వాట్ల కంటే తక్కువగా ఉన్నది. గత 24 గంటల్లో నికోబార్ దీవుల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.
ఆయా పరిస్థితులను పరిశీలిస్తే నైరుతి రుతుపవనాలు మాల్దీవులు, కొమోరిన్ ప్రాంతంలోని కొన్ని ప్రాంతాలు, దక్షిణ బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలతో పాటు నికోబార్ దీవులు అండ్ దక్షిణ అండమాన్లోకి ప్రవేశించాయని ఐఎండీ తెలిపింది. రుతుపవనాలు ఈ నెల 31న కేరళను తాకుతాయని అంచనా వేసింది. ఆ తర్వాత దేశవ్యాప్తంగా విస్తరిస్తాయని వివరించింది. రుతుపవనాల సీజన్లో భారత్లో సాధారణం కంటే ఎక్కువగానే వర్షాపాతం నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. ఇదిలా ఉండగా.. మే 22 వరకు అండమాన్ అండ్ నికోబార్ దీవులకు వాతావరణశాఖ ఎల్లో హెచ్చరిక జారీ చేసింది.