Southwest Monsoon | ఆగ్నేయ అరేబియా సముద్రం మీదుగా అల్పపీడనం ఏర్పడింది. ఇది రాబోయే రెండు రోజుల్లో మరింత బలపడనున్నది. నైరుతి రుతుపవనాలను ప్రభావితం చేయనుందని భారత వాతావరణ శాఖ సోమవారం తెలిపింది. అయితే, కేరళను రుతుపవనాలు రెండు రోజుల్లో కేరళను తాకే అవకాశం ఉందని అంచనా వేసింది. దక్షిణ అరేబియా సముద్రం మీదుగా 2.1 కిలోమీటర్ల వరకు పశ్చిమ గాలులు వీస్తాయని శాఖ పేర్కొంది. సైక్లోనిక్ సర్క్యులేషన్ కారణంగా మేఘాలు కలిసి ఒకే ప్రాంతంలో కేంద్రీకృతమై ఉంటాయని, దీని ప్రభావంతో నైరుతి రుతుపవనాలు కేరళ తీరం వైపు వెళ్లే అవకాశాలపై ప్రభావం పడనున్నదని పేర్కొంది.
ఇంతకు ముందు జూన్ 4న కేరళను రుతుపవనాలు తాకే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. సాధారణంగా రుతుపవనాలు ఏటా జూన్ 1న కేరళలోకి ప్రవేశిస్తాయి. గతేడాది మే 29 కేరళను తాకకగా.. 2021లో జూన్ 3న, 2020లో జూన్ 1న, 2019లో జూన్ 8, 2018లో మే 29న నైరుతి రుతుపవనాలు కేరళను తాకాయి. ఎల్నినో కారణంగా నైరుతి రుతుపవనాల సమయంలో భారత్లో సాధారణ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ ఇంతకు ముందు తెలిపింది. తూర్పు, ఈశాన్య, మధ్య, దక్షిణ ద్వీపకల్పంలో సాధారణ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని. నైరుతి రుతుపవనాలు భారత వ్యవసాయ రంగానికి కీలకం. సాగు విస్తీర్ణంలో 52శాతం వాటిపై ఆధారపడి ఉంటుంది. అదే సమయంలో విద్యుత్ ఉత్పత్తితో పాటు తాగునీటికి సైతం రుతుపవనాలపైనే ఆధారపడాల్సిన పరిస్థితి ఉన్నది.