చెన్నై: తెలంగాణలో అమలు అవుతున్న రైతు బంధు, రైతు బీమా, వ్యవసాయ రంగానికి 24 గంటల ఉచిత విద్యుత్ లాంటి సంక్షేమ కార్యక్రమాలను తమిళనాడులోనూ అమలు చేయాలని సౌత్ ఇండియా రైతు సంఘం తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ను కోరింది. చెన్నైలో సౌత్ ఇండియా రైతు నాయకులు సమావేశం నిర్వహించి అనంతరం సీఎం స్టాలిన్ను కలిశారు.
అలాగే.. తెలంగాణ రాష్ట్రంలో అమలు అవుతున్న వ్యవసాయం సంక్షేమ కార్యక్రమాలు అన్ని రాష్ట్రాల్లో అమలు చేసేలా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తేవాలని రైతు సంఘం నాయకులు నిర్ణయించారు. ఈనేపథ్యంలో తమిళనాడు ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు.
తెలంగాణలో అమలవుతున్న పథకాలకు సంబంధించిన విజ్ఞాపక పత్రాన్ని సీఎం స్టాలిన్కు సౌత్ ఇండియా రైతు సంఘాల నాయకులు అందజేశారు. ఈసందర్భంగా మాట్లాడిన సీఎం స్టాలిన్.. తెలంగాణలో వ్యవసాయ పథకాలు అద్భుతంగా ఉన్నాయని కొనియాడారు. తెలంగాణలో అమలవుతున్న పథకాలను తమిళనాడులో అమలు చేసే విషయాన్ని పరిశీలిస్తామని రైతు సంఘం నాయకులకు సీఎం స్టాలిన్ హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో పసుపు బోర్డు సాధన సమితి అధ్యక్షుడు, జాతీయ రైతు సంఘం ఉపాధ్యక్షుడు నరసింహనాయుడు, రాష్ట్రీయ కిసాన్ మహాసంఘ్ కో ఆర్డినేటర్ పీటీ జాన్(కేరళ), కర్ణాటక సంయుక్త కిసాన్ మోర్చా అధ్యక్షుడు శాంతా కుమార్(కర్ణాటక), ఇతర రైతు సంఘాల నాయకులు పాల్గొన్నారు.