న్యూఢిల్లీ : చైనా సహా పలు దేశాల్లో కొవిడ్-19 కేసులు వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపధ్యంలో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఆరోగ్య శాఖ మంత్రులతో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ భేటీ కానున్నారు. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్గా జరిగే ఈ కీలక భేటీలో వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై విస్తృతంగా చర్చిస్తారు.
నూతన సంవత్సర వేడుకలు అనంతరం పండుగల సీజన్ కోసం కొవిడ్ నూతన మార్గదర్శకాలను ఈ సందర్భంగా ఆరోగ్య మంత్రిత్వ శాఖ జారీ చేయనుంది. ఈ మార్గదర్శకాలపైనా మన్సుఖ్ మాండవీయ రాష్ట్రాల ఆరోగ్య శాఖ మంత్రులతో సంప్రదింపులు జరుపుతారు.
మరోవైపు న్యూ కొవిడ్ వేవ్ ముంచెత్తనుందనే భయాల నడుమ కేంద్రం గురువారం అంతర్జాతీయ విమాన ప్రయాణీకుల కోసం నూతన మార్గదర్శకాలను జారీ చేసింది. విమానాశ్రయాల్లో విదేశాల నుంచి వచ్చే వారికి స్క్రీనింగ్ నిర్వహించాలని, వైరస్ లక్షణాలున్నవారిని క్వారంటైన్కు తరలించాలని అధికారులను ఆదేశించింది. వైరస్ వ్యాప్తి నేపధ్యంలో ప్రజలు విధిగా మాస్క్లు ధరించాలని, అవసరమైన జాగ్రత్తలు పాటించాలని కోరింది.