Ananthkumar Hedge : రాజ్యాంగాన్ని మార్చాలని వివాదాస్పద వ్యాఖ్యలతో దుమారం రేపిన కర్నాటక ఎంపీ అనంత్ కుమార్ హెగ్డేకు బీజేపీ గట్టి షాక్ ఇచ్చేలా ఉంది. ఉత్తర కన్నడ నియోజకవర్గం నుంచి అనంత్ కుమార్ హెగ్డేను బరిలో నిలపాలని నిర్ణయించిన బీజేపీ వివాదాస్పద వ్యాఖ్యల నేపధ్యంలో ఆయన అభ్యర్ధిత్వాన్ని రెండో జాబితా నుంచి తొలగించిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రానున్న లోక్సభ ఎన్నికలకు బీజేపీ రెండో జాబితాను ఖరారు చేసేందుకు సోమవారం బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ) సమావేశమైంది.
ఈ భేటీలో గుజరాత్, మహారాష్ట్ర, బిహార్, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, తెలంగాణ, కర్నాటక, చండీఘఢ్ రాష్ట్రాల్లో దాదాపు 99 మంది అభ్యర్ధులను సీఈసీ ఖరారు చేసింది. ఇక రాజ్యాంగంపై దురుసు వ్యాఖ్యలు చేసిన అనంత్ హెగ్డేకు రెండో జాబితాలో బీజేపీ మొండిచేయి చూపనుందని చెబుతున్నారు. ఆయన వ్యాఖ్యలతో పార్టీకి సంబంధం లేదని బీజేపీ ఇప్పటికే స్పష్టం చేసింది. హెగ్డేతో పాటు కర్నాటక నుంచి పలువురు ఎంపీలకు ఈసారి టికెట్లు దక్కే పరిస్ధితి లేదని అంటున్నారు.
ఉడిపి చిక్మంగళూర్కు ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రి శోభా కరంద్లాజెను బెంగళూర్ నార్త్ సీటుకు పంపించవచ్చని భావిస్తున్నారు. ఆమెకు టికెట్ ఇవ్వద్దని ఉడిపి పార్టీ నేతలు బీజేపీ చీఫ్ జేపీ నడ్డాకు లేఖలు రాశారు. ఇక మైసూర్ నుంచి ప్రతాప్ సింహ, దావణగెరె నుంచి మాజీ కేంద్ర మంత్రి సిద్ధేశ్వర, బళ్లారి నుంచి యరబసి దేవేంద్రప్ప, కొప్పల్ నుంచి కరది సంగన్న అమరప్ప, మంగళూర్ ఎంపీ, రాష్ట్ర బీజేపీ మాజీ చీఫ్ నలిన్ కుమార్ కటీల్కు స్ధాన చలనం, లేదా టికెట్ల నిరాకరించే అవకాశం ఉందని భావిస్తున్నారు.
Read More :
Vande Bharat | సికింద్రాబాద్ – విశాఖ మధ్య పట్టాలెక్కిన మరో వందేభారత్.. ప్రారంభించిన మోదీ