న్యూఢిల్లీ : బీజేపీ, ఆరెస్సెస్లతో పోరాడే క్రమంలో అంతర్గత విభేదాలను పక్కనపెట్టి నేతలంతా క్రమశిక్షణతో సమైక్య పోరు సాగించాలని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ పేర్కొన్నారు. సోనియా మంగళవారం పార్టీ ప్రధాన కార్యదర్శులు, రాష్ట్ర శాఖల చీఫ్లు, ఇతర నేతలను ఉద్దేశించి మాట్లాడారు. కాషాయ పార్టీతో పాటు ఆరెస్సెస్ భావజాలంతో మనం పోరాడుతూ వారు ప్రచారం చేస్తున్న అసత్యాలను తిప్పికొట్టాలంటే మనం కలిసికట్టుగా ముందుకు సాగాల్సిన అవసరం ఉందని అన్నారు.
దేశం ఎదుర్కొంటున్న సమస్యలు, కీలకాంశాలపై ఏఐసీసీ ప్రతిరోజూ సవివర ప్రకటనలు జారీ చేస్తున్నా అవి బ్లాక్, జిల్లా స్ధాయిలో పార్టీ శ్రేణుల వరకూ చేరడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. విధానపరమైన అంశాలపై రాష్ట్రస్ధాయి నేతల్లో కూడా స్పష్టత కొరవడినట్టు తాను గుర్తించానని ఆమె పేర్కొన్నారు. పార్టీ పలు రాష్ట్రాల్లో అంతర్గత పోరు, తిరుగుబాటులను ఎదుర్కొంటున్న నేపధ్యంలో పార్టీలో క్రమశిక్షణ, ఐక్యత గురించి సోనియా కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీని బలోపేతం చేయడంలో మనం సమైక్యంగా ముందుకు సాగాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.