న్యూఢిల్లీ : కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ గురువారం ఈడీ ఎదుట హాజరుకానున్నారు. నేషనల్ హెరాల్డ్ కేసులో ఈ నెల 21న విచారణకు హాజరుకావాలని ఈడీ ఇటీవల సమన్లు జారీ చేసిన విషయం విధితమే. ఈడీ విచారణ నేపథ్యంలో దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టేందుకు కాంగ్రెస్ సన్నాహాలు చేపట్టినట్లు తెలుస్తున్నది. ఇంతకు ముందు ఆ పార్టీ నేత రాహుల్ గాంధీని సైతం ఈడీ విచారించిన సమయంలోనూ కాంగ్రెస్ నిరసనలు చేపట్టింది. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ నేతలు ప్రత్యేకంగా వ్యూహం రచించినట్లు తెలుస్తున్నది.
పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాకు మద్దతు తెలిపేందుకు పార్టీ సీనియర్లు గురువారం ఏఐసీసీ కార్యాలయంలో సమావేశం కానున్నారు. ఎంపీలు, సీనియర్ పాల్గొనున్నారు. అనంతరం వారంతా ఈడీ కార్యాలయానికి వెళ్లనున్నారు. ఇదిలా ఉండగా.. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా కాంగ్రెస్ అగ్రనాయకత్వంపై నిరంతరం కుట్రలు చేస్తున్నారని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ విమర్శించారు. రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు.