లక్నో : రైతుల సమస్యలు, నిరుద్యోగ సమస్య పరిష్కారంతో పాటు కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో మోదీ, యోగి సర్కార్లు ఘోరంగా విఫలమయ్యాయని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ విమర్శించారు. కాషాయ పార్టీ గొప్పగా చెప్పుకొంటున్న డబుల్ ఇంజిన్ సర్కార్ యూపీ ప్రజలకు చేసిందేమీ లేదని మండిపడ్డారు. యూపీ ప్రజల మధ్య విభేదాలు, చీలిక తేవడం మినహా వారు ఒరగబెట్టింది లేదని దుయ్యబట్టారు. సోమవారం ఓ ఆన్లైన్ కార్యక్రమంలో సోనియా గాంధీ మాట్లాడుతూ యూపీలో రైతులు కష్టాలకు ఓర్చి వ్యవసాయం చేస్తున్నా వారికి ఎరువులు రాయితీపై అందడం లేదని, నీటిపారుదల సౌకర్యాలు లేవని ఆందోళన వ్యక్తం చేశారు. యువతకు యోగి సర్కార్ ఉపాధి అవకాశాలు అందుబాటులోకి తేవడం లేదని, పైగా పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి ప్రజలపై భారాలు మోపిందని ఆరోపించారు.
లాక్డౌన్ సమయంలో వ్యాపారాలు మూతపడితే వలస కూలీలు కిలోమీటర్ల కొద్దీ నడిచి స్వస్ధలాలకు చేరుకున్నారని అన్నారు. ప్రజలు ఇన్ని కష్టాలు పడితే మోదీ-యోగి ప్రభుత్వం బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తూ ముఖం చెల్లక పాలకులు కండ్లు మూసుకున్నారని విమర్శలు గుప్పించారు. మోదీ-యోగి ప్రభుత్వం ప్రజలకు ఎలాంటి ఊరట కల్పించలేదని దుయ్యబట్టారు. ఇక 2017 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఏడు సీట్లతో సరిపెట్టుకున్న కాంగ్రెస్ ఈసారి సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతోంది. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఈనెల 23న జరగనున్న నాలుగో దశ పోలింగ్పై ప్రధాన రాజకీయ పార్టీలు దృష్టి సారించాయి. నాలుగో దశ పోలింగ్కు చివరిరోజైన సోమవారం ప్రచారం హోరెత్తించాయి. సోమవారం సాయంత్రం ఐదు గంటలకు ప్రచార గడువు ముగియనుంది. 9 జిల్లాల్లోని 60 అసెంబ్లీ నియోజకవర్గాల్లో నాలుగో దశ పోలింగ్ జరగనుంది. తొలి మూడు దశల్లో 403 స్ధానాలున్న యూపీలో 172 సీట్లకు పోలింగ్ జరిగింది.
ఇక నాలుగో దశలో 624 మంది అభ్యర్ధులు తమ అదృష్టం పరీక్షించుకోనున్నారు. గాంధీ కుటుంబానికి పట్టున్న లక్నో, రాయ్బరేలి ప్రాంతాల్లో ఇదే విడత పోలింగ్ జరగనుండటంతో నాలుగో దశ ఆయా పార్టీలకు రాజకీయంగా కీలకంగా మారింది. అవధ్ ప్రాంతంలో గెలిచిన పార్టీ రాష్ట్రంలో అధికారం చేపడుతుందని గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లో నిర్ధారణ కావడంతో నాలుగో దశ పోరును ఆయా పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. కాగా ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7 వరకూ ఏడు దశల్లో యూపీ అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా మార్చి 10న ఓట్ల లెక్కింపు చేపట్టి పలితాలు ప్రకటిస్తారు. ఇక యూపీ ఎన్నికల్లో విజయం సాధించి మరోసారి పాలనా పగ్గాలు చేపట్టాలని పాలక బీజేపీ సర్వశక్తులూ ఒడ్డుతుండగా, యోగి సర్కార్పై వ్యతిరేకతను సొమ్ము చేసుకుని అందలం ఎక్కాలని అఖిలేష్ యాదవ్ సారధ్యంలోని ఎస్పీ చెమటోడుస్తొంది. మరోవైపు ప్రధాన పార్టీలకు దీటైన పోటీ ఇచ్చేందుకు బీఎస్పీ, కాంగ్రెస్ తమదైన వ్యూహాలకు పదునుపెడుతున్నాయి.