న్యూఢిల్లీ : రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్షాల తరపున ఉమ్మడి అభ్యర్ధిని బరిలో దింపేందుకు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ సన్నద్ధమయ్యారు. డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, సీపీఎం నేత సీతారాం ఏచూరీ సహా పలువురు విపక్ష నేతలతో సంప్రదింపులు జరిపేందుకు కసరత్తు సాగిస్తున్నారు.
తదుపరి భారత రాష్ట్రపతి అభ్యర్ధిగా ఎవరిని బరిలో దింపాలనే విషయంలో విపక్ష నేతలతో చర్చించడంతో పాటు వారి మనోగతం తెలుసుకునే బాధ్యతను రాజ్యసభలో విపక్ష నేత మల్లికార్జున ఖర్గేకు సోనియా అప్పగించారు. ఎన్డీయేతర, యూపీయేతర పక్షాలతోనూ మంతనాలు జరపాలని ఖర్గేను సోనియా ఆదేశించినట్టు కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. ఖర్గే విపక్ష నేతలతో చర్చించి రాష్ట్రపతి అభ్యర్ధులుగా ఎవరి పేర్లను పరిశీలించాలనే దానిపై కసరత్తు సాగిస్తారు.
కాగా రాష్ట్రపతి ఎన్నికకు ఈసీ గురువారం షెడ్యూల్ ప్రకటించింది. జులై 18న రాష్ట్రపతి ఎన్నికలు జరగనుండగా జులై 21న ఫలితాలు ప్రకటిస్తారు. రాష్ట్రపతి రామ్నాధ్ కోవింద్ పదవీకాలం జులై 24తో ముగియనుంది. ఎన్నికల్లో 4809 మంది ఓటు హక్కును వినియోగించుకుంటారని రాజకీయ పార్టీలు తమ సభ్యులకు ఎలాంటి విప్ జారీ చేయరాదని ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ పేర్కొన్నారు.