న్యూఢిల్లీ, జూన్ 10: తృణమూల్ కాంగ్రెస్ భవిష్యత్తుపై కొత్త రాజకీయ ఊహాగానాలు పుట్టుకొచ్చాయి. తృణమూల్ కాంగ్రెస్ను కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయాలని కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీ తానే స్వయంగా పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వద్ద ప్రతిపాదించినట్లు ఆ పార్టీ వర్గాలు సూచించాయి. టీఎంసీ అంతర్గత విభేదాలు, పలువురు ప్రముఖుల నిష్క్రమణలతో సతమతమవుతున్న తరుణంలో ఈ సంప్రదింపులు జరుగడం, భవిష్యత్ ఎన్నికల పోరాటాల ముందు పార్టీ స్థిరత్వంపై ప్రశ్నలను లేవనెత్తుతున్నది. టీఎంసీపై బీజేపీ నుండి పెరుగుతున్న రాజకీయ ఒత్తిడిపై సోనియా గాంధీ తన ఆందోళనను వ్యక్తం చేసినట్లు తెలుస్తున్నది. కాంగ్రెస్లో విలీనం చేయడం వల్ల ప్రతిపక్షం బలోపేతం కావడమే కాకుండా బీజేపీ విసిరే సవాళ్లను ఎదుర్కోవడంలోనూ అది సహాయపడుతుందని మమత వద్ద సోనియా సూచించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. సోనియాగాంధీ స్వయంగా మమతా బెనర్జీని సంప్రదించి ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై చర్చించారని ఆ వర్గాలు పేర్కొన్నాయి.
కీలక పదవుల ఆఫర్
విలీనం జరిగితే అనుసరించాల్సిన కార్యాచరణ ప్రణాళికను కాంగ్రెస్ నాయకత్వం రూపొందించి ఉండవచ్చని వర్గాలు పేర్కొన్నాయి. ఈ ప్రతిపాదన ప్రకారం కాంగ్రెస్ పార్టీలో మమతా బెనర్జీకి జాతీయ ఉపాధ్యక్షురాలి పదవిని ఆఫర్ చేయవచ్చు. అదే సమయంలో టీఎంసీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మమత మేనల్లుడు, ఎంపీ అభిషేక్ బెనర్జీకి కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా కీలక నాయకత్వ పాత్రలో చోటు కల్పించవచ్చు అని పార్టీ వర్గాలు తెలిపాయి.
అవన్నీ ఊహాగానాలే: టీఎంసీ
కాంగ్రెస్ పార్టీలో తృణమూల్ కాంగ్రెస్ విలీనం అయ్యే అవకాశాలు ఉన్నట్లు వెలువడిన వార్తలను తృణమూల్ కాంగ్రెస్ బుధవారం తోసిపుచ్చింది. రాహుల్ గాంధీ, టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీ మధ్య జరిగిన చర్చలలో విలీనంపై ఎటువంటి ప్రస్తావన లేదని ఉన్నత స్థాయి వర్గాలు వివరించాయి. అవన్నీ ఊహాగానాలు మాత్రమేనని స్పష్టం చేశాయి.
మాదే అసలైన టీఎంసీ
మమతా బెనర్జీపై తిరుగుబాటు చేసి పార్టీ నుంచి బహిష్కృతుడైన టీఎంసీ ఎమ్మెల్యే రితబ్రత బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్పై యాజమాన్యాన్ని ప్రకటించుకున్నారు. కాంగ్రెస్లో టీఎంసీ విలీనంపై వస్తున్న వదంతులను తోసిపుచ్చిన ఆయన తిరుగుబాటు వర్గమే అసలైన టీఎంసీ అని ప్రకటించారు. తాము కాంగ్రెస్లో విలీనం కావడం లేదని ఆయన స్పష్టం చేశారు.
19కి పెరిగిన టీఎంసీ తిరుగుబాటు ఎంపీల బలం
తృణమూల్ కాంగ్రెస్ తిరుగుబాటు ఎంపీలు ప్రత్యేక గ్రూపుగా ఏర్పడేందుకు అవసరమైన పార్లమెంటరీ పార్టీలో మూడింట రెండు వంతుల మెజారిటీని సంపాదించుకున్నట్లు తెలుస్తున్నది. టీఎంసీ ఎంపీలు యూసుఫ్ పఠాన్, సాయోనీ ఘోష్, మాలా రాయ్ కూడా తిరుగుబాటు జాబితాలో సంతకం చేయడంతో ఈ వర్గం బలం 19కి పెరిగినట్లు తెలుస్తున్నది. 28 ఏండ్ల తృణమూల్ కాంగ్రెస్ చరిత్రలో అతి పెద్ద చీలిక ఏర్పడడంతో పార్టీ సంక్షోభంలో పడింది. కాగా, తిరుగుబాటు ఎంపీలపై టీఎంసీ ఎంపీ మహువా మొయిత్ర తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. వారికి మూడింట రెండు వంతుల ఎంపీల బలం లభించినప్పటికీ బీజేపీలో విలీనం చేయడం తప్ప వేరే గత్యంతరం లేదని ఆమె విమర్శించారు.
మమతకు మరో ఎంపీ ఝలక్
మమతా బెనర్జీకి వారం వ్యవధిలోనే మరో ఎంపీ ఝలక్ ఇచ్చారు. ఆ పార్టీ ఎంపీ సుష్మిత దేవ్ బుధవారం తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. పార్టీని కూడా వీడుతున్నట్టు ప్రకటించారు. ఆ వెంటనే ఆమె ఢిల్లీలో ఉన్న అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మను కలిశారు. ఆయనతో భేటీని మర్యాదపూర్వకమైనదిగా ఆమె పేర్కొన్నారు. అయితే ఈ భేటీతో ఆమె బీజేపీలో చేరవచ్చని ఊహగానాలు మొదలయ్యాయి. టీఎంసీ ఎంపీ సుఖేందు శేఖర్ రాయ్ ఇటీవలే రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు.