Priyanka Gandhi: ఉత్తరప్రదేశ్లోని రాయ్బరేలీ లోక్సభ స్థానం 1950ల నుంచి కాంగ్రెస్ పార్టీ కంచుకోటగా ఉంది. నాటి నుంచి నేటి వరకు ఒక్క 1977, 1996, 1998 మినహా ప్రతిసారి కాంగ్రెస్ అభ్యర్థే విజయం సాధిస్తూ వస్తున్నారు. 1977లో జనతాపార్టీకి చెందిన రాజ్ నారాయణ్, 1996, 1998లో బీజేపీకి చెందిన అశోక్సింగ్ విజయం సాధించారు.
ఇక 2004 నుంచి వరుసగా ఐదుసార్లు సోనియాగాంధీ అక్కడి నుంచి గెలిచారు. అయితే ఈసారి సోనియాగాంధీ రాజ్యసభకు వెళ్లే అవకాశం ఉంది. దాంతో రాయ్బరేలిలో ఎవరు పోటీ చేస్తారనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సోనియాగాంధీ కుమార్తె ప్రియాంకాగాంధీ ఈసారి రాయ్బరేలి నుంచి బరిలో దిగుతారనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో నియోజకవర్గంలోని ప్రియాంకాగాంధీ అభిమానులు ఆమెను నియోజకవర్గానికి ఆహ్వానిస్తూ పోస్టర్లు వేశారు. ప్రియాంకా గాంధీజీ రాయ్బరేలీ పిలుస్తోంది రండి అంటూ పోస్టర్లు అంటించారు. ‘ప్రియాంకా గాంధీజీ రాయ్బరేలీ పిలుస్తోంది. దయచేసి రండి. కాంగ్రెస్ను ముందుకు నడిపించండి’ అనే టెక్ట్స్తోపాటు సోనియా గాంధీ, కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ, మాజీ ప్రధాని ఇందిరా గాంధీ, స్వాతంత్ర్య సమరయోధుడు చంద్రశేఖర్ ఆజాద్ల ఫోటోలతో కూడిన పోస్టర్లు నియోజకవర్గంలో ప్రత్యక్షమయ్యాయి.
రాయ్బరేలీకి గతంలో మాజీ ప్రధాని, దివంగత ఇందిరాగాంధీ కూడా ప్రాతినిధ్యం వహించారు. 2019 ఎన్నికల్లో దేశవ్యాప్తంగా మోదీ ప్రభంజనంతో అమేథీలో రాహుల్గాంధీ ఓడిపోయినా, దేశవ్యాప్తంగా కాంగ్రెస్కు తీవ్ర ప్రతికూలతలు ఎదురైనా.. రాయ్బరేలీలో మాత్రం కాంగ్రెస్ తట్టుకొని నిలబడింది. సోనియాగాంధీ వరుసగా ఐదోసారి విజయం సాధించారు.