Congress | న్యూఢిల్లీ, జనవరి 10: అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరు కావడం లేదని కాంగ్రెస్ ప్రకటించింది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత సోనియా గాంధీ, లోక్సభా పక్ష నేత అధిర్ రంజన్ చౌదరి ఈ నెల 22న జరిగే ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి వెళ్లకూడదని నిర్ణయం తీసుకొన్నారని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ బుధవారం ప్రకటించారు. ఎన్నికల లబ్ధి కోసం బీజేపీ, ఆరెస్సెస్లు రామ మందిర ప్రారంభోత్సవాన్ని ఒక ‘పొలిటకల్ ప్రాజెక్టు’గా మార్చాయని విమర్శించారు. ఇంకా నిర్మాణం పూర్తికాని ఆలయాన్ని ప్రారంభించడం వెనుక ఉద్దేశాన్ని ఆయన ఓ ప్రకటనలో ప్రశ్నించారు. మన దేశంలో రాముడిని కోట్లాది మంది పూజిస్తారని, మతం అనేది ఒక వ్యక్తిగత అంశమని జైరాం రమేశ్ అన్నారు. 2019లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు కట్టుబడి, కోట్లాది మంది రామ భక్తుల మనోభావాలను గౌరవిస్తూ అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమ ఆహ్వానాన్ని ఖర్గే, సోనియా, అధిర్లు మర్యాదపూర్వకంగా తిరస్కరించారని ఆయన తెలిపారు.
కాంగ్రెస్ అగ్రనేతలు తీసుకొన్న నిర్ణయానికి విరుద్ధంగా ఆ పార్టీకి చెందిన పలువురు నేతలు తాము అయోధ్యకు వెళ్తామని ప్రకటనలు చేశారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి తాను హాజరవుతానని హిమాచల్ప్రదేశ్ మంత్రి, కాంగ్రెస్ నేత విక్రమాదిత్య సింగ్ సోమవారం ప్రకటించారు. తనకు ఆహ్వానం పంపినందుకు ఆరెస్సెస్, వీహెచ్పీలకు ఆయన కృతజ్ఞతలు చెప్పారు. మరోవైపు యూపీ కాంగ్రెస్ అధ్యక్షుడు అజయ్ రాయ్, రాష్ట్ర పార్టీ ఇన్చార్జి అవినాశ్ పాండే, దాదాపు 100 మంది ఇతర పార్టీ నేతలు ఈనెల 15న అయోధ్యను సందర్శించనున్నారు.
కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు రామ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమ ఆహ్వానాన్ని తిరస్కరించడంపై బీజేపీ స్పందించింది. త్రేతాయుగంలో రావణుడికి జరిగినట్టుగానే వారు కూడా మైండ్ కోల్పోయారని విమర్శించింది. బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి నలిన్ కోహ్లీ మాట్లాడుతూ గత కొన్ని దశాబ్దాలుగా కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలో అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి ఎలాంటి చర్యలు తీసుకోలేదని, అలాంటప్పుడు కాంగ్రెస్ ప్రస్తుత నిర్ణయం పెద్దగా ఆశ్చర్యం కలిగించలేదని పేర్కొన్నారు. రాముడి ఉనికినే కొట్టిపారేస్తూ కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం గతంలో సుప్రీంకోర్టులో అఫిడవిట్ వేసిందని, అయోధ్య సమస్య పరిష్కారం కాకూడదని, ఆలయం నిర్మాణం కాకూడదని ఆ పార్టీ కోరుకున్నదని ఆరోపించారు.