న్యూఢిల్లీ, జూలై 18: ఆరోగ్య కారణాలను సాకుగా చూపి జంతర్ మంతర్ నుంచి వాతావరణ కార్యకర్త, విద్యావేత్త సోనమ్ వాంగ్చుక్ను బలవంతంగా తరలించడం ఆదివారం(జూలై 19) ప్రభుత్వం ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశంలో చర్చకు రానున్నది. అన్ని ప్రధాన పార్టీల సభాపక్ష నాయకులు పాల్గొనే ఈ సమావేశంలో అయోధ్య రామ మందిరం విరాళాల దుర్వినియోగంతో సహా పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. రామ మందిర విరాళాల నిర్వహణలో అక్రమాలు జరిగినట్లు వచ్చిన ఆరోపణలపై కూడా సమావేశంలో ప్రధానంగా చర్చ జరగనున్నది.
ఈ అంశంపై సభ కార్యకలాపాలకు అడ్డుపడతామని సమాజ్వాది పార్టీ ఇప్పటికే ప్రకటించింది. అంతేకాకుండా రానున్న వర్షాకాల సమావేశాల్లో లోక్సభ లేదా రాజ్యసభలో ప్రవేశపెట్టనున్న ఐదు కొత్త బిల్లులను ప్రభుత్వం ప్రకటించింది. జాతీయ గౌరవానికి అవమానాలను నిరోధించే(సవరణ) బిల్లు, జనన మరణాల నమోదు(సవరణ) బిల్లు, 2026 , ఆదాయపు పన్ను(సవరణ) బిల్లు, 2026, సుప్రీంకోర్టు (న్యాయమూర్తుల సంఖ్య) సవరణ బిల్లు, 2026 తదితర బిల్లులను ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నది. వీటిపైనా చర్చ జరిగే అవకాశం ఉన్నది.
మహారాష్ట్రలో శివసేన (యూబీటీ) నుంచి వేరుపడిన ఆరుగురు ఎంపీలు.. ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన పార్టీలో విలీనం కావడాన్ని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా శనివారం ఆమోదించారు. ఈ నెల 20 నుంచి లోక్సభ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న క్రమంలో స్పీకర్ ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు.
ఈ ఆరుగురు ఎంపీలు పశ్చిమ బెంగాల్కు చెందిన 20 మంది టీఎంసీ రెబల్ ఎంపీలతో పాటు ప్రత్యేకంగా కూర్చునేందుకు అనుమతించారు. వీరి చేరికతో శివసేన (షిండే) ఎంపీల సంఖ్య 13కు చేరింది. అయితే తమను నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎన్సీపీఐ)గా గుర్తించాలని రెబల్ టీఎంసీ ఎంపీలు చేస్తున్న డిమాండ్పై స్పీకర్ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. కాగా, ఆదివారం జరిగే అఖిలపక్ష సమావేశానికి ఈ రెబల్ టీఎంసీ ఎంపీలు కూడా హాజరు కానున్నారు.