న్యూఢిల్లీ : గోవా టూర్లో గుండెపోటుతో మరణించిన నటి, బీజేపీ నేత సొనాలి ఫోగట్ మృతిపై సీబీఐ విచారణ జరిపించాలని ఆమె కుటుంబసభ్యులు బుధవారం డిమాండ్ చేశారు. టిక్టాక్ స్టార్ సొనాలి సోదరుడు గోవా పోలీసులకు ఫిర్యాదు చేశారు. సొనాలీని ఆమె ఇద్దరు అసోసియేట్స్ హత్య చేశారని ఆయన ఆరోపించారు. సొనాలి మృతిపై సీబీఐ విచారణ జరిపించాలని ఆమె కుటుంబసభ్యులు కోరుతున్నారు.
అంజునా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశానని, సొనాలిని పధకం ప్రకారం హత్య చేశారని, ఆమె వ్యక్తిగత అసిస్టెంట్తో పాటు ఇద్దరు వ్యక్తులపై తమకు అనుమానాలున్నాయని ఆమె సోదరుడు రింకు ఢాక పేర్కొన్నారు. సొనాలి హత్యపై సీబీఐ విచారణ జరిపించాలని, గోవాలో జరిపిన పోస్ట్మార్టం పట్ల తమకు అనుమానాలున్నాయని వ్యాఖ్యానించారు. సొనాలి మృతదేహానికి ఎయిమ్స్లో మరోసారి పోస్ట్మార్టం నిర్వహించాలని కోరారు. తాము సందేహం వ్యక్తం చేసిన ఇద్దరు వ్యక్తులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసేందుకు పోలీసులు విముఖత చూపారని ఆరోపించారు.
సొనాలి ఫోగట్ మరణానికి ముందు రోజు రాత్రి ఆమెకు ఫోన్ చేసిన వారంతా సొనాలి చలాకీగా మాట్లాడారని చెప్పారని, అనూహ్యంగా ఇలా ఎలా జరిగిందని విస్మయం వ్యక్తం చేశారు. పధకం ప్రకారమే ఇదంతా జరిగిందని, తాము దీన్ని పసిగట్టలేకపోయామని అన్నారు. సొనాలి మృతిపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని ఆమె సోదరుడు కోరారు. మరోవైపు సొనాలి ఫోగట్ ఆహారంలో విష ప్రయోగం జరిగిందని ఆమె సోదరి ఆరోపించారు.