న్యూఢిల్లీ, మార్చి 1: కేంద్ర ప్రభుత్వంలోని మరికొన్ని కీలక పదవులను త్వరలోనే నిపుణులైన ప్రైవేటు వ్యక్తులతో భర్తీ చేయనున్నారు. వివిధ ప్రభుత్వ విభాగాల్లో సంయుక్త కార్యదర్శులుగా ముగ్గురు, డైరెక్టర్లు, డిప్యూటీ సెక్రటరీలుగా 22 మంది ప్రైవేటు వ్యక్తులను నియమించేందుకు ప్రధాని మోదీ నేతృత్వంలోని క్యాబినెట్ అపాయింట్మెంట్స్ కమిటీ ఆమోదించింది.
ఈ పోస్టుల్లో ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ తదితర అధికారులను నియమించాల్సి ఉంటుంది. అయితే వివిధ రంగాలకు చెందిన నిపుణులను భాగం చేసేందుకు 2018 నుంచి ఇలా ప్రైవేటు వ్యక్తుల నియామకం ప్రారంభించారు. ప్రస్తుతం జాయింట్ సెక్రటరీలుగా 8 మంది, డైరెక్టర్లుగా 16 మంది, డిప్యూటీ సెక్రటరీలుగా తొమ్మిది మంది ప్రైవేట్ వ్యక్తులు వేర్వేరు ప్రభుత్వ శాఖల్లో పని చేస్తున్నారు. ప్రైవేటు రంగాలకు చెందిన నిపుణులతో పాటు రాష్ట్ర ప్రభుత్వ, స్వయంప్రతిపత్తి కలిగిన, ప్రభుత్వ రంగ సంస్థల్లో పని చేస్తున్న వారిని కూడా ఈ విధంగా నియమించనున్నారు.