ముంబై : మరి కొద్ది రోజుల్లో బీజేపీకి చెందిన అరడజను మంది నాయకులు కటకటాల్లోకి వెళ్తారని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ అన్నారు. ముంబైలోని శివసేన ప్రధాన కార్యాలయంలో మంగళవారం విలేకరుల సమావేశంలో ఆ నేతల పేర్లు వెల్లడిస్తానన్నారు. గతేడాది నవంబర్లో మనీలాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్టు చేసిన రాష్ట్ర మాజీ హోంశాఖ మంత్రి అనిల్ దేశ్ముఖ్ త్వరలో జైలు నుంచి బయటకు వస్తారన్నారు.
ఇటీవల ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని ప్రభుత్వంలోని కొంత మంది నేతలపై ప్రతిపక్ష బీజేపీ అవినీతి ఆరోపణలు చేసిన విషయం విధితమే. ఈ క్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ఏజెన్సీలను ఉపయోగించి బెదిరించొద్దన్నారు. తాము భయపడబోమన్నారు. శివసేన, థాకరే కుటుంబంపై చేసిన తప్పుడు ఆరోపణలకు, కేంద్ర సంస్థల ‘దాదాగిరి’.. అన్నింటికి సమాధానాలు చెబుతామని సంజయ్ రౌత్ హెచ్చరించారు. మంగళవారం నాటి విలేకరుల సమావేశాన్ని శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే నిశితంగా పరిశీలిస్తారని చెప్పారు. తన సమావేశాన్ని బీజేపీ, కేంద్ర సంస్థల చీఫ్లు తప్పనిసరిగా చూడాలని సంజయ్ రౌత్ అన్నారు.
‘మహారాష్ట్ర అంటే ఏంటో రేపు వారికి తెలిసి వస్తుందని.. శివసేన అంటే మహారాష్ట్ర.. శివసేన మహారాష్ట్రలో 11కోట్ల మంది ప్రజల గొంతుక’ అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ మహారాష్ట్ర పరువు తీశారని, అయినా రాష్ట్రానికి చెందిన బీజేపీ నేతలు ఇప్పటికీ మౌనంగా ఉన్నారని ఆరోపించారు. ఇదిలా ఉండగా.. ఎంవీఏ ప్రభుత్వాన్ని కూల్చేందుకు సహాయం చేయాలని కొంత మంది తనను ఇటీవల సంప్రదించారని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.