దేశ సరిహద్దులో శత్రువుతో పోరాడి ఓ సైనికుడు అమరుడైతే దేశం కన్నా ఏం కావాలని అంటారు ఆ ఇంటి ఆడబిడ్డలు. కానీ, పోరాడకుండానే సైనికుల ప్రాణాలు పోతే! అంతకన్నా బాధ ఇంకోటి ఉండదు. హెలికాప్టర్ల ప్రమాదాల్లో సైనికుల మరణాలు అవే. ఈ ఘటనపై ఆవేదన చెందిన సైనికుల భార్యలు.. ‘భారత్లో జీవించటానికి సైనికులు, వాళ్ల కుటుంబాలకు హక్కు లేదా? దేశ రక్షణకు పాటుపడుతున్నవారికి సరైన హెలికాప్టర్లను అందించలేరా?’ అని ప్రధానిని నిలదీశారు. ఈ మేరకు 140 మంది కలిసి మోదీకి లేఖ రాశారు.
న్యూఢిల్లీ, అక్టోబర్ 7: శత్రువుతో పోరాడి చనిపోతే అది.. సైనికుడి అమరత్వం. అంతకుమించిన వీరత్వం. వెల కట్టలేని త్యాగం అది. కానీ, ఎలాంటి పోరాటం లేకుండానే ఎంతోమంది సైనికుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. కారణం.. సైనిక హెలికాప్టర్లు. అవును! సైనిక హెలికాప్టర్ కుప్పకూలి ఏకంగా జనరల్ బిపిన్ రావత్ దుర్మరణం చెందారు.
2017 నుంచే చూసుకొంటే పదుల సంఖ్యలో జరిగిన సైనిక హెలికాప్టర్ల ప్రమాదాల్లో ఎంతోమంది సైనికులు అమరులయ్యారు. మొన్నటికి మొన్న అరుణాచల్ప్రదేశ్లోని తవంగ్లో చీతా హెలికాప్టర్ కుప్పకూలి ఒక పైలట్ దుర్మరణం చెందగా, మరో పైలట్ దవాఖానలో చికిత్స పొందుతున్నాడు. ఇప్పటికీ డొక్కు హెలికాప్టర్లు కొనసాగిస్తుండటంపై ఆగ్రహం వ్యక్తంచేస్తూ ఆర్మీ అధికారుల భార్యలు తాజాగా ప్రధాని మోదీకి లేఖ రాశారు.
2021లో కుప్పకూలిన 5 చాపర్లు
2021లో మొత్తం 5 చాపర్లు కుప్పకూలగా అందులో రెండు ధృవ్ అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్లు, ఒక చీతా హెలికాప్టర్, రెండు ఎంఐ-17వీ5 హెలికాప్టర్లు ఉన్నాయి. అందులో 2021 డిసెంబర్లో కుప్పకూలిన ఎంఐ-17వీ5 హెలికాప్టర్ ప్రమాదంలో సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ దుర్మరణం చెందారు. ఆయనతో పాటు మరో 12 మంది ఈ ఘటనలో మృతిచెందారు.
ఇదే ఏడాది ఆగస్టులో పఠాన్కోట్లో ధృవ్ హెలికాప్టర్ కుప్పకూలి ఇద్దరు పైలట్లు చనిపోయారు. అంతకుముందు జనవరిలోనూ ఒక పైలట్ మృతిచెందగా, మరో పైలట్ తీవ్ర గాయాలతో బయటపడ్డాడు. 2019లో ఎంఐ-17వీ5 హెలికాప్టర్ కూలి ఆరుగురు, అదే ఏడాది చీతా హెలికాప్టర్ ప్రమాదంలో భూటాన్ అధికారి దుర్మరణం చెందారు. వాణిజ్య అవసరాలకు వాడే పవన్ హాన్స్ హెలికాప్టర్లు కూడా తరచూ ప్రమాదాలకు గురవుతున్నాయి. 1998-2018 మధ్య పవన్హాన్స్ హెలికాప్టర్ల ప్రమాదాల్లో 91 మంది మరణించారు.
ప్రధానికి ‘ఆర్మీ వైఫ్స్’ లేఖ
సైనిక హెలికాప్టర్ల ప్రమాదాలపై ఇండియన్ ఆర్మీ వైఫ్స్ గ్రూప్ ఆందోళన వ్యక్తం చేసింది. 2017 నుంచి చీతా, చెతక్ హెలికాప్టర్ల ప్రమాదాల్లో 31 మంది సైనికులు అమరులయ్యారని వెల్లడించింది. ‘భారత్లో జీవించటానికి సైని కులు, వాళ్ల కుటుంబాలకు హక్కు లేదా? దేశ రక్షణకు పాటుపడుతున్నవారికి సరైన హెలికాప్టర్లను అందించలేరా?’ అని ప్రధాని మోదీని లేఖలో ప్రశ్నించింది. 1960ల్లో వాడే హెలికాప్టర్లను ఇప్పుడూ వాడుతున్నారని, వాటి వల్లే తరచూ ప్రమాదాలు చోటుచేసుకొంటున్నాయని పేర్కొన్నారు.
టీ-90 యుద్ధ ట్యాంకు పేలి ఇద్దరు జవాన్ల మృతి
ఝాన్సీ: టీ-90 యుద్ధ ట్యాంకు బ్యారెల్ పేలి ఇద్దరు ఆర్మీ జవాన్లు మరణించారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లో ఝాన్సీలోని బబీనా కంటోన్మెంట్లో గురువారం చోటుచేసుకున్నది. ఫీల్డ్ ఫైరింగ్ డ్రిల్ నిర్వహిస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకున్నదని, మరణించిన వారిలో ఒక జూనియర్ కమిషన్డ్ అధికారి ఉన్నాడని ఆర్మీ అధికారులు పేర్కొన్నారు.