గుణుపుర: ప్రముఖ సామాజిక కార్యకర్త, పద్మ శ్రీ అవార్డు గ్రహీత శాంతి దేవి కన్నుమూశారు. ఒడిశాలోని రాయ్గడ్ జిల్లాలో ఆదివారం ఆమె తుది శ్వాస విడిచారు. ఆమె వయసు 88 ఏళ్లు. కోరాపుట్ జిల్లాలోని గిరిజన అమ్మాయిల అభివృద్ధి కోసం శాంతిదేవి కృషి చేశారు. బాలాసోర్ జిల్లాలో ఆమె 1934, ఏప్రిల్ 18న జన్మించారు. 17 ఏళ్ల వయసులో ఆమె డాక్టర్ రతన్ దాస్ను పెళ్లి చేసుకున్నారు. రాయ్గడ్ జిల్లాలోని సంకల్పదార్లో ఆశ్రయం ఏర్పాటు చేశారామె. అక్కడ లెప్రసీ పేషెంట్లకు ఆమె సేవ చేశారు. 1955లో ఆచార్య వినోభా భావేను ఆమె కలుసుకున్నారు. ఆయన స్పూర్తితో ఆమె గిరిజనుల అభివృద్ధి కోసం పాటుపడ్డారు. భూదాన్ ఉద్యమంలోనూ శాంతిదేవి పాల్గొన్నారు.
అనాథులు, పేద పిల్లలు, అభాగ్యుల కోసం 1964లో గుణుపురలో సేవా సమాజ్ ఆశ్రమాన్ని ఆమె ప్రారంభించారు. విద్య, వొకేషనల్ కోర్సుల కోసం ఆమె ఆశ్రమాన్ని కూడా ఓపెన్ చేశారు. గిరిజన అమ్మాయిల కోసం పలు స్కూళ్లు, హాస్టళ్లను ఆమె నడిపారు. పద్మశ్రీతో పాటు జమునాలాల్ బజాజ్, రాధానాథ్ రథ్ పీస్ అవార్డులను ఆమె గెలుచుకున్నారు.
శాంతిదేవి మృతి పట్ల ప్రధాని మోదీ నివాళి అర్పించారు. పేదలు, అణగారిన వర్గాల గొంతుగా ఆమె నిలిచి ఉంటారన్నారు. ఆరోగ్యకర సమాజం కోసం అవిశ్రాంతంగా ఆమె పోరాటం చేసినట్లు మోదీ తన ట్వీట్లో తెలిపారు. శాంతిదేవి కుటుంబసభ్యులకు ప్రధాని సంతాపం తెలిపారు.
Shanti Devi Ji will be remembered as a voice of the poor and underprivileged. She worked selflessly to remove suffering and create a healthier as well as just society. Pained by her demise. My thoughts are with her family and countless admirers. Om Shanti. pic.twitter.com/66MLo73LUK
— Narendra Modi (@narendramodi) January 17, 2022