న్యూఢిల్లీ: దేశంలో పెద్దమెత్తంలో అక్రమంగా రవాణా అవుతున్న రూ. 12 వేల కోట్ల విలువైన హెరాయిన్ను అధికారులు పట్టుకున్నారు. అరేబియన్ సముద్రంలో కొచ్చి కోస్తా ఆవలి ప్రాంతంలో ఈ మాదకద్రవ్యాలు పట్టుబడ్డాయి. సముద్ర తీరం వెంబడి డ్రగ్స్ రవాణా జరుగుతుందని 15 రోజుల క్రితం సమాచారం అందింది. ఈ మేరకు నార్కోటిక్స్ నియంత్రణ విభాగం (ఎన్సీబీ), భారత నేవీ సంయుక్తంగా జరిపిన ఈ దాడిలో అరేబియన్ సముద్రంలో ఇరాక్ నుంచి ఆస్ట్రేలియాకు అక్రమంగా నౌకలో రవాణా అవుతున్న 2500 కేజీల హెరాయిన్ను పట్టుకున్నారు.
అంతర్జాతీయ మార్కెట్లో దీని విలువ 12,000 కోట్ల రూపాయలుంటుందని అంచనా. ఇంతకుముందెప్పుడూ ఇంత భారీ మొత్తంలో డ్రగ్స్ను స్వాధీనం చేసుకోలేదని ఎన్సీబీ అధికారి ఒకరు తెలిపారు. కశ్మీర్లోని కుప్వారా జిల్లాల్లో శనివారం నలుగురు స్మగ్లర్ల నుంచి పోలీసులు భారీగా నగదు, హెరాయిన్ స్వాధీనం చేసుకున్నారు. స్మగ్లర్లు వివిధ రాష్ట్రాల్లో హెరాయిన్ సరఫరా చేస్తున్నారని పోలీసులు వెల్లడించారు.