Karnataka Minister Thangadagi | కర్ణాటక మంత్రి శివరాజ్ థంగడాయి వ్యాఖ్యలతో అధికార కాంగ్రెస్ పార్టీ వివాదంలో చిక్కుకున్నది. ఎవరైనా యువకులు, విద్యార్థులు మోదీ పేరెత్తితే చెంప దెబ్బ కొట్టాలని కర్ణాటక కన్నడ అండ్ కల్చరల్ మినిస్టర్ శివరాజ్ థంగడాయి తన పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఆదివారం కొప్పల్ లోక్ సభా స్థానం పరిధిలో ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు.
ప్రధాని నరేంద్రమోదీ ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారని శివరాజ్ థంగడాయి గుర్తు చేశారు. ప్రధాని నరేంద్రమోదీ గత పదేండ్లలో ఉద్యోగాలు కల్పిస్తే 20 కోట్ల మందికి ఉపాధి లభించేందన్నారు. కానీ ప్రధాని మోది ప్రస్తుతం నిరుద్యోగ యువత ఉపాధి కోసం పకోడీలు అమ్ముకోవాలని కోరుతున్నారన్నారు. బీజేపీ పార్టీ పేరు చెప్పి ఓట్లు అడుగుతున్నదని, కానీ, కరవు సాయం కోసం కర్ణాటకకు కేంద్రం నయాపైసా ఇవ్వలేదని శివరాజ్ థంగడాయి ఆరోపించారు. దీంతో కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించిందన్నారు.