చండీగఢ్, ఫిబ్రవరి 22: న్యాయమైన డిమాండ్ల సాధనకు తాము చేస్తున్న ఆందోళనను తూటాల ద్వారా అణచివేయాలనుకుంటున్న మోదీ ప్రభుత్వ వైఖరిపై రైతు సంఘాలు మండిపడ్డాయి. యువ రైతును అన్యాయంగా పొట్టనబెట్టుకున్నారంటూ ఆక్రోశించాయి. ఆందోళనలో పాల్గొన్న యువ రైతు మృతిపై హోం మంత్రి అమిత్ షా, హర్యానా సీఎం మనోహర్లాల్ ఖట్టర్లపై హత్య కేసు నమోదు చేయాలని సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) గురువారం డిమాండ్ చేసింది. ఆయన మృతికి నిరసనగా శుక్రవారం దేశ వ్యాప్తంగా బ్లాక్ డే పాటించాలని, 26న ట్రాక్టర్ ర్యాలీలు నిర్వహించాలని పిలుపునిచ్చింది.
ఢిల్లీ చలో కార్యక్రమంలో భాగంగా బుధవారం పోలీసులతో జరిగిన ఘర్షణలో మృతి చెందిన శుభకరణ్ సింగ్ (21) కుటుంబానికి రూ.కోటి పరిహారాన్ని చెల్లించాలని ఎస్కేఎం నేత రాజేవాల్ డిమాండ్ చేశారు. ఆయన మృతికి నిరనసగా శుక్రవారం రైతులు కేంద్ర మంత్రి అమిత్ షా, హర్యానా హోంమంత్రి అనిల్ విజ్ దిష్టిబొమ్మలను దగ్ధం చేయాలని, ఈ నెల 26న దేశ వ్యాప్తంగా ట్రాక్టర్ ర్యాలీలు నిర్వహించాలని, మార్చి 14న ఢిల్లీలోని రామ్లీలా మైదానంలో సభకు హాజరవ్వాలని ఆయన పిలుపునిచ్చారు. ఇళ్లపై, వాహనాలకు నల్ల జెండాలను ఉంచాలన్నారు. ఘటనకు బాధ్యత వహిస్తూ అమిత్ షా, ఖట్టర్ రాజీనామా చేయాలని మరో ఎస్కేఎం నేత జోగీందర్ సింగ్ ఉగ్రహ డిమాండ్ చేశారు.
రైతులకు మద్దతుగా పోస్టులు పెట్టే వారి ఖాతాలు, పోస్టులు బ్లాక్ చేయాలంటూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులపై సామాజక మాధ్యమం ఎక్స్ విభేదిస్తూనే వాటిని నిలిపివేయడానికి అంగీకరించింది. అయితే వాటిని భారత్లో మాత్రమే నిలిపివేస్తామని తెలిపింది. భావ ప్రకటనా స్వేచ్ఛను ఈ పోస్టులకు కూడా విస్తరించాలని కోరింది. న్యాయపరమైన ఆంక్షల కారణంగా ప్రభుత్వ ఉత్తర్వులను ప్రచురించలేకపోతున్నామని తెలిపింది.