తిరుమల: తిరుమల (Tirumala) కాలినడక మార్గంలో (Steps way) తీవ్ర విషాద ఘటన చోటుచేసుకున్నది. అలిపిరి కాలినడక మార్గంలో ఆరేండ్ల చిన్నారిపై చిరుతపులి (Leopard) దాడికి పాల్పడింది. దీంతో ఆ పాప మృతిచెందింది. ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా పొతిరెడ్డిపాలెం గ్రామానికి చెందిన లక్షిత (6) తన కుటుంబ సభ్యులతో కలిసి శుక్రవారం రాత్రి 8 గంటల సమయంలో అలిపిరి నుంచి కాలినడకన తిరుమల శ్రీవారి దర్శనానికి బయలుదేరింది. ఈ క్రమంలో రాత్రి 11 గంటలకు వారంతా లక్ష్మీనరసింహస్వామి గుడి వద్దకు చేరుకున్నారు.
అయితే ముందు నడుస్తున్న లక్షితపై చిరుతపులి ఒక్కసారిగా దాడిచేసింది. కుటుంబ సభ్యులు కేకలు వేయడంతో పాపను అడవిలోకి లాక్కెళ్లింది. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదుచేశారు. అయితే రాత్రి సమయం కావడంతో గాలింపు వీలుపడలేదు. ఉదయం గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులకు.. లక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి కొద్ది దూరంలో బాలిక మృతదేహాన్ని గుర్తించారు. పాపను సగానికి తిని వదిలివెళ్లిపోయిందని పోలీసులు తెలిపారు. కాగా, గత నెల మెట్ల మార్గంలో ఓ బాలుడిపై చిరుత దాడి చేసిన విషయం తెలిసిందే. అయితే అతడు తీవ్రగాయాలతో బయటపడ్డాడు.