బెంగళూరు: కర్ణాటక రాష్ట్రం యాద్గిర్ జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు వ్యక్తులు గ్రామ శివార్లలోని చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. గ్రామస్తులు ఇచ్చిన సమాచారం మేరకు ఘటనా ప్రాంతానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గజ ఈతగాళ్లను చెరువులో దించి మృతదేహాలను వెలికి తీయిస్తున్నారు.
ఆర్థిక ఇబ్బందులతోనే వారు ఆత్మహత్యకు పాల్పడినట్లు తమ ప్రాథమిక దర్యాప్తులో తేలిందని పోలీసులు తెలిపారు. ఆత్మహత్యకు పాల్పడిన కుటుంబం తమకున్న కొద్దిపాటి భూమిలో ఉద్యానవన పంట వేశారని, అకాల వర్షాల కారణంగా ఆ పంట చేతికి రాకపోవడంతో ఆర్థికంగా నష్టపోయిన వారు ఈ తీవ్ర నిర్ణయం తీసుకున్నారని చెప్పారు.