పట్నా: ఆ రాష్ట్రంలో సంపూర్ణ మద్యనిషేధం అమల్లో ఉన్నది. అయినా కల్తీ మద్యం తాగి మరణిస్తున్నారనే వార్తలు తరచూ వస్తూనే ఉన్నాయి. మరి మద్యాన్ని నిషేధించిన రాష్ట్రంలోకి మందు ఎలా వస్తున్నది? ఎక్కడి నుంచి వస్తున్నది? ఇప్పుడు సర్వత్రా వినిపిస్తున్న ప్రశ్న ఇదే..
సంపూర్ణ మద్యనిషేధం అమలులో బీహార్లో కల్తీ మద్యం సేవించి ఆరుగురు మరణించారు. బక్సర్ జిల్లాలోని అమ్సారీలో బుధవారం రాత్రి పలువురు కల్తీ మద్యం సేవించారు. దీంతో వారిలో ఆరుగురు మృతిచెందగా, మరో నలుగురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. స్థానికులు వారిని దవాఖానకు తరలించారు.
సమాచారం అందుకున్న అధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని బక్సర్ ఎస్పీ నీరజ్ కుమార్ సింగ్ తెలిపారు. సరన్ జిల్లాలో కల్తీ మద్యం తాగడంతో ఐదుగురు మరణించి వారం రోజులు కూడా గడవకముందే మరో ఘటన జరగడం గమనార్హం.
సీఎం నితీశ్ కుమార్ ప్రభుత్వం 2016లో రాష్ట్రంలో సంపూర్ణ మద్యనిషేధం విధించింది. అయినప్పటికీ ముజఫర్పూర్, గోపాల్గంజ్, బెట్టియా, సమస్తీపూర్, వైశాలి, నవాడా, సీఎం సొంత జిల్లా అయిన నలందాలోనూ అక్రమ మద్యం ఏరులై పారుతున్నది. ఈ క్రమంలో కల్తీ మద్యం సేవించి పలువులు మృత్యువాతపడుతున్నారు.