గంగాధర, మార్చి 13 : తాము నిత్యం విష కీటకాలతో సహవాసం చేస్తున్నామని, తమ గోడు పట్టించుకోవాలని నారాయణపూర్ గ్రామస్తులు వేడుకున్నారు. తమ గ్రామాన్ని ముంపు గ్రామంగా ప్రకటించి, ఆర్అండ్ఆర్ ప్యాకేజీ కింద పరిహారం అందజేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం గ్రామంలోని చావడి వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ, 20 ఏళ్లుగా నారాయణపూర్ రిజర్వాయర్తో ఇబ్బందులు పడుతున్నామన్నారు. ప్రభుత్వం సర్వే చేసి కేవలం 27 ఇండ్లను మాత్రమే ముంపు కింద తీసుకుందని, కట్టకు మరమ్మతులు చేసి ఎత్తు పెంచే పనులు కూడా అధికారులు ప్రారంచారని తెలిపారు. ఇప్పటికే రిజర్వాయర్తో ఇబ్బందులు పడుతుంటే, కట్ట ఎత్తు మరింత పెంచి తమను మరింత కష్టాల్లోకి తీసుకువెళ్లడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదన్నారు. రిజర్వాయర్ నిండిన ప్రతిసారి కట్ట జాలు పట్టి ఇండ్ల గోడలు పదునెక్కి ఎప్పుడు కూలుతాయే తెలియక బిక్కుబిక్కు మంటూ గడుపుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో తాను గెలిచాక ఆరు నెలల్లో రిజర్వాయర్ సమస్యను పరిష్కరించి, గ్రామస్తులకు నాయ్యం చేస్తానని చెప్పిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, గెలిచిన తర్వాత పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం, అధికారులు స్పందించి తమ సమస్యను పరిష్కరించాలని కోరారు.
నారాయణపూర్ రిజర్వాయర్తో మా భూములకు నష్టమైతంది. మా బాధలు ఎవ్వలు పట్టించుకుంటలేరు. ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మా ఊరికి వచ్చిండు. కట్టను పరిశీలించి, సమస్య పెద్దగా ఉంది, ఊరిని మొత్తం ముంపు కింద తీసుకోవాలసిందే అని చెప్పిండు. ఇప్పడు ఏం సప్పుడుజేత్తలేడు. మా నారాయణపూర్ ఊరు మొత్తాన్ని తీసుకుని పరిహారం అందజేయాలని ఎమ్మెల్యే, అధికారులకు దండంపెట్టి కోరుతున్నం.
నారాయణపూర్ రిజార్వయర్ కింద కేవలం 27 ఇండ్లకు మాత్రమే పరిహారం ఇస్తున్నట్లు తెలిసింది. వాటితో పాటు మా మొత్తం గ్రామాన్ని కూడా ముంపు గ్రామంగా తీసుకోవాలి. వానకాలంలో రిజర్వాయర్ కట్ట తెగినప్పుడు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని భయం భయంగా గడిపినం. చుట్టూ నీళ్లు, నీళ్ల మధ్యల మేం. రాత్రంతా జాగారం చేసినం. ఇసొంటి కష్టాలు ఎవ్వలకు రావద్దు.