లక్నో: ఉత్తరప్రదేశ్లోని ఉన్నావ్లో ట్రక్కు బీభత్సం సృష్టించింది. రోడ్డు పక్కనే నిలబడి ఉన్న ముగ్గురిని ఢీకొట్టిన ట్రక్కు.. మరో కారును ఢీకొట్టింది. దీంతో ఆరుగురు అక్కడికక్కడే మృతిచెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. సోమవారం తెల్లవారుజామున ఉన్నావ్ జిల్లా అచల్గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లక్నో-కాన్పూర్ జాతీయ రహదారిపై వేగంగా దూసుకొచ్చిన ట్రక్కు.. రోడ్డుపై నిల్చున్న ముగ్గురిని ఢీకొట్టింది.
అప్పటికీ ఆగని లారీ.. ఎదురుగా వస్తున్న మారుతీ కారును గుద్దింది. కారులో ఉన్న ముగ్గురితోపాటు ముగ్గురు పాదచారులు దుర్మరణం చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడినవారిని దవాఖానకు తరలించారు.