ముంబై: మహారాష్ట్రలోని అహ్మద్నగర్ జిల్లా దవాఖానలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. దవాఖానలోని ఐసీయూలో మంటలు చెలరేగడంతో పది మంది కరోనా రోగులు సజీవదహనమయ్యారు. మరో 11 మంది రోగులు తీవ్రంగా గాయపడ్డారు. శనివారం ఉదయం 11.30 గంటల సమయంలో జిల్లా దవాఖానలోని ఐసీయూలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో అందులో చికిత్స పొందుతున్న 17 మందిలో 10 మంది అక్కడికక్కడే మృతిచెందారు.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేశారు. ప్రమాదానికి గల కారణం ఇంకా తెలియరాలేదని చెప్పారు. అయితే గాయపడిన 11 మంది రోగుల పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. వారిని మరో దవాఖానకు తరలించామన్నారు.