న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1: గిఫ్ట్ సిటీకి ఈ పద్దులో పెద్ద ఎత్తునే దన్ను లభించింది. గుజరాత్ రాజధాని గాంధీనగర్లో సింగపూర్కు పోటీగా నిర్మించారంటున్న ఈ ఫైనాన్షియల్ హబ్లోగల వ్యాపార కార్యకలాపాలకు ఊతమిస్తూ తాజా బడ్జెట్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పలు ప్రకటనలు చేశారు. నిజానికి 2008లో మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ ప్రాజెక్టు మొదలైంది. మొదట్లో ఇది నత్తనడకన సాగినా.. మోదీ ప్రధాని అయ్యాక జెట్ స్పీడును అందుకోవడం గమనార్హం. మోదీ సర్కారు ద్వంద్వ నీతికి ఇదే నిలువెత్తు నిదర్శనం. ఇప్పటికే కేంద్రం నుంచి ఏటా రకరకాల ప్రోత్సాహకాలు అందుతున్నాయి. తాజా బడ్జెట్లోనూ ఇదే కొనసాగింది. అయితే భారతీయ ట్యాక్స్ వర్గాల నుంచి మాత్రం కొంత వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. విదేశీ ఆర్థిక సంస్థల పరిధిలో ఉండటమే కారణంగా వినిపిస్తున్నది. ఇక బడ్జెట్ నిర్ణయాల విషయానికొస్తే..
తెలంగాణకు మొండిచెయ్యి
బీజేపీపాలిత గుజరాత్లోని గిఫ్ట్ సిటీపై ఈ బడ్జెట్లో కేంద్రం వరాల వర్షం కురిపిస్తే.. తెలంగాణకు మాత్రం మొండిచెయ్యే చూపించింది. రాష్ట్ర ప్రభుత్వం అడిగిన ఏ ప్రోత్సాహకాన్నీ ఇవ్వలేదు. పైగా గతంలో రాష్ర్టానికి ప్రకటించిన ఐటీఐఆర్నూ రద్దు చేయడం గమనార్హం. తెలంగాణకు పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్న నేపథ్యంలో రాష్ర్టానికి ఐటీఐఆర్ను మంజూరు చేయాలని, పలు రాయితీలు, పారిశ్రామిక ప్రోత్సాహకాలు అందజేయాలని కోరుతున్నా.. మోదీ సర్కారు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. మిగతా రంగాల పరిస్థితీ సరేసరి.