Morbi Bridge | గుజరాత్ (Gujarat) లోని మోర్బీ కేబుల్ బ్రిడ్జి ( Morbi Bridge) ప్రమాదానికి సంబంధించి సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ వంతెన గతేడాది అక్టోబర్ 30న కూలిపోయిన విషయం తెలిసిందే. ఈ దుర్ఘటనలో సుమారు 135 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే, గుజరాత్ ప్రభుత్వం (Gujarat government) నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) చేపట్టిన విచారణలో.. కూలడానికి ముందే ఈ బ్రిడ్జిలో చాలా లోపాలు ఉన్నాయని తేలింది.
వంతెనకు చెందిన ఓ ప్రధాన కేబుల్లో దాదాపు సగం తీగలు తుప్పు పట్టి ఉండటం, పాత సస్పెండర్లనే కొత్త వాటితో వెల్డింగ్ చేయడం వంటి ప్రధాన లోపాల కారణంగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు సిట్ తన ప్రాథమిక దర్యాప్తులో గుర్తించింది. వంతెన మరమ్మత్తులు, నిర్వహణలో అనేక లోపాలు జరిగినట్లు గుర్తించినట్లు సిట్ తన నివేదికలో పేర్కొంది.
‘1887లో మచ్చు నదిపై బ్రిటీష్ వాళ్లు నిర్మించిన ఈ వంతెనలో రెండు ప్రధాన తీగలున్నాయి. ఈ రెండు కేబుల్స్లో నదికి ఎగువ వైపు ఉన్న కేబుల్ తెగిపోవడం వల్లే.. ఈ విషాదం చోటు చేసుకుంది. వంతెన ప్రధాన కేబుళ్లు.. ఏడు ఉప తీగలు, అందులో ప్రతి తీగ మళ్లీ ఏడు ఉక్కువైర్లను కలిగి ఉన్నాయి. ఇలా మొత్తం 49 వైర్లతో కేబుల్ను రూపొందించారు. అయితే, కేబుల్లోని 22 వైర్లు అప్పటికే తుప్పు పట్టి ఉన్నాయి. ప్రమాదానికి ముందే అవి తెగిపోయి ఉండొచ్చు. మిగిలిన 27 వైర్లు ప్రమాద సమయంలో ధ్వంసమయ్యాయి. అలాగే వంతెన పునరుద్ధరణలో భాగంగా పాత సస్పెండర్లను కొత్త వాటితో వెల్డింగ్ చేశారు. ఇదీ ప్రమాదానికి ఓ కారణమే. ఈ రకమైన వంతెనల్లో ఒకటే సస్పెండర్ను వినియోగించాలి’ అని సిట్ తన నివేదికలో పేర్కొంది.
దాదాపు 143 ఏళ్లనాటి సస్పెన్షన్ బ్రిడ్జి ఆధునీకరణ పనులను గుజరాత్ ప్రభుత్వం.. ఒరెవా గ్రూప్నకు అప్పగించింది. బ్రిడ్జి ఆధునీకరణ పనులు పూర్తయ్యాయని, పర్యాటకుల కోసం తిరిగి తెరచుకోచ్చని ఒరెవా గ్రూప్ చైర్మన్ జైకుష్ పటేల్ గతేడాది అక్టోబర్ 24న ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఎలాంటి భద్రతా పరమైన అనుమతులు లేకుండా నిర్వహణ సంస్థ పర్యాటకులను బ్రిడ్జిపైకి అనుమతించింది. ఈ క్రమంలో అదే నెల 30న తీగల వంతెన కుప్పకూలడంతో 135 మంది మృత్యువాత పడగా.. 100 మందికిపైగా గాయపడ్డారు.