న్యూఢిల్లీ, మార్చి 8: ఢిల్లీలో నూతన విద్యా విధానానికి కృషి చేసిన మాజీ డిప్యూటీ సీఎం, ఆప్ నేత మనీశ్ సిసోడియాను కరడుగట్టిన ఖైదీలు ఉండే తీహార్ జైలు-1 వార్డులో ఉంచారని ఆ పార్టీ నేత సంజయ్ సింగ్ ఆరోపించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సిసోడియాను హత్య చేయడానికే అక్కడ ఉంచారేమోనని, ఆయనకు అక్కడ ప్రాణహాని ఉన్నదని ఆరోపించారు. అసలు మొదటిసారి ఖైదీ అయిన వ్యక్తిని అలాంటి నేరస్థులతో ఉంచుతారా? అని ప్రశ్నించారు. ఒక అండర్ట్రైల్ ఖైదీని సెల్ నెంబర్1లో ఉంచరని, అందులో హంతకులు, కరడుగట్టిన నేరస్థులు, కొందరు పిచ్చివాళ్లు కూడా ఉంటారని మరో ఆప్ నేత సౌరభ్ భరద్వాజ ఆరోపించారు. కాగా, ఈ ఆరోపణలను తీహార్ జైలు అధికారులు కొట్టివేస్తూ సిసోడియా భద్రత దృష్ట్యా అతడిని వేరొక వార్డుకు మారుస్తున్నట్టు తెలిపారు. వీలైతే ప్రత్యే సెల్ కేటాయిస్తామన్నారు.
దేశం కోసం కేజ్రీవాల్ సుదీర్ఘ ధ్యానం
హోలీ సందర్భంగా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ బుధవారం ఏడు గంటల పాటు ధ్యానం చేశారు. ఈ చిత్రాలను ఆప్ ట్విట్టర్లో పోస్ట్ చేసి, కేజ్రీవాల్ దేశం కోసం ప్రార్థించారని తెలిపింది. ధ్యానం ప్రారంభించడానికి ముందు కేజ్రీవాల్ రాజ్ఘాట్లో గాంధీకి నివాళి అర్పించారు. ‘దేశంలో మంచి చదువు, వైద్యం అందించేవారిని ప్రధాని జైల్లో పెడతారు. దేశాన్ని దోచుకొనేవారికి మద్దతిస్తారు. నేను దేశం కోసం ధాన్యం, ప్రార్థన చేస్తాను. మీరు కూడా ప్రధాని మోదీ చేస్తున్నది తప్పని భావిస్తే, దేశం గురించి ఆందోళన చెందుతుంటే దేశం కోసం ప్రార్థించండి’ అని కేజ్రీవాల్ వీడియో సందేశంలో పేర్కొన్నారు.