ముంబై: ప్రముఖ గాయిని లతా మంగేష్కర్ ఆరోగ్యం కొద్దిగా మెరుగుపడిందని వైద్యులు ప్రకటించారు. అయితే ఆమె ఇంకా ఐసీయూలోనే చికిత్స పొందుతున్నారని చెప్పారు. తీవ్ర అనారోగ్యానికి గురైన లతా మంగేష్కర్.. గత కొన్ని రోజులుగా ముంబైలోని బ్రీచ్ క్యాండీలో దవాఖానలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆమెకు వైద్యులు ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు.
తాజాగా ఆమె ఆరోగ్యానికి సంబంధించి డాక్టర్లు హెల్త్బులిటెన్ విడుదల చేశారు. లతా ఆరోగ్యం కాస్త మెరుగుపడిందని డాక్టర్ ప్రతిత్ సామ్దాని చెప్పారు. అయితే ఐసీయూలో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని వెల్లడించారు. ఆమె త్వరగా కోలుకోవాలని ప్రార్ధించాలని సూచించారు.
కొన్ని రోజుల క్రితం లతా మంగేష్కర్ కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. దీంతో ఈ నెల 11న ఆమెను బ్రీచ్ క్యాండీ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి న్యుమోనియా ఉందని తేల్చారు. అప్పట్నుంచి ఆమె ఐసీయూలోనే ఉంచి చికిత్స అందిస్తున్నారు.