ముంబై: కరోనా మహమ్మారి బారినపడి ఆస్పత్రిలో చేరిన ప్రముఖ గాయని, భారతరత్న అవార్డు గ్రహీత లతామంగేష్కర్ ఇంకా ఐసీయూలోనే ఉన్నారు. ప్రస్తుతం ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆస్పత్రిలో ఆమె అత్యవసర చికిత్స పొందుతున్నారు. కరోనాకు తోడు ఆమెకు అంతకుమునుపే న్యుమోనియా కూడా ఉండటంతో వైద్యులు వెంటిలేటర్పై ఉంచి చికిత్స అందిస్తున్నారు.
కాగా, కొవిడ్ పాజిటివ్గా తేలడంతో లతా మంగేష్కర్ను ఈ నెల 11న బ్రీచ్ క్యాండీ ఆస్పత్రిలో అడ్మిట్ చేశారు. కరోనాకు తోడు న్యుమోనియా కూడా వేధిస్తుండటంతో ఆమె సరిగా శ్వాస తీసుకోలేకపోతున్నారు. దాంతో వెంటిలేటర్ అమర్చారు. ఐసీయూలోనే ఉంచి వైద్యులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. లతామంగేష్కర్ త్వరలో కోలుకోవాలని ఆశిస్తున్నట్లు ఆమెకు చికిత్స అందిస్తున్న ప్రధాన వైద్యుడు డాక్టర్ ప్రతీత్ సమ్దాని చెప్పారు.
ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా లతా మంగేష్కర్ మరికొన్ని రోజులు ఐసీయూలోనే ఉండాల్సి వస్తుందన్నారు. ఆమె హిందీ, మరాఠీ, బెంగాలీతోపాటు పలు ప్రాంతీయ భాషల్లో పాటలు పాడారు. నేపథ్య గాయనిగా సీనిరంగంలో ఆమె అందించిన సేవలకు గుర్తింపుగా ఎన్నో అవార్డులు సొంతం చేసుకున్నారు. భారత రత్న, పద్మభూషణ్, పద్మవిభూషణ్, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డులతోపాటు ఇంకా ఎన్నో పురస్కారాలను ఆమె స్వీకరించారు.