Lok Sabha Elections | న్యూఢిల్లీ, ఏప్రిల్ 4: ఎన్నికల్లో గెలవాలంటే పార్టీల జెండాలు, గుర్తులే కాదు అభ్యర్థుల ఇమేజ్ కూడా చాలా ముఖ్యం. మన దేశంలో తొలినాళ్లలో పార్టీల కంటే అభ్యర్థుల బలాబలాల మీదనే గెలుపోటములు ఆధారపడి ఉండేవి. ప్రజల్లో మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్న నేతలు స్వతంత్రులుగా బరిలో దిగినా ప్రజలు గెలిపించే వారు. అయితే, కాలక్రమంలో స్వతంత్రుల ప్రభావం తగ్గిపోయింది. 1951 – 52లో జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికల్లో 533 మంది స్వతంత్ర అభ్యర్థులు పోటీ చేయగా 37 మంది విజయం సాధించారు. 2019లో జరిగిన 17వ సార్వత్రిక ఎన్నికల్లో దాదాపుగా 8 వేల మంది స్వతంత్ర అభ్యర్థులు పోటీ చేయగా కేవలం నలుగురు మాత్రమే విజయం సాధించారు.
దేశంలో స్వతంత్రంగా పోటీ చేసే అభ్యర్థుల సంఖ్య భారీగా పెరుగుతున్నప్పటికీ వీరిలో గెలిచే వారి సంఖ్య తగ్గుతూ వస్తున్నది. 1957 ఎన్నికల్లో 1,519 మంది స్వతంత్రులు పోటీ చేయగా 42 మంది విజయం సాధించారు. 1962లో విజయాన్ని అందుకుంది 20 మందే. ఇందిరా గాంధీ మరణం అనంతరం 1984 ఎన్నికల్లో కేవలం 13 మంది స్వతంత్రులే విజయం సాధించారు. 96 శాతం మంది డిపాజిట్లు కోల్పోయారు.
గత సార్వత్రిక ఎన్నికల్లో ఎనిమిది వేలకు పైగా స్వతంత్రులు ఎన్నికల బరిలో నిలిచారు. వీరిలో కేవలం నలుగురు మాత్రమే విజయం సాధించారు. 99.6 శాతం మంది డిపాజిట్లు కోల్పోయారు.
కర్ణాటకలో సుమలత అంబరీశ్, మహారాష్ట్రలో నవ్నీత్ రాణా, అస్సాంలో సరానియా, దాద్రా అండ్ నగర్ హవేలీ నుంచి మోహన్భాయ్ సంజిభాయ్ దేల్కర్ విజయం సాధించారు.
గత కొన్ని దశాబ్దాలుగా స్వతంత్ర అభ్యర్థులపై ప్రజలకు నమ్మకం సన్నగిల్లుతున్నట్టు గెలిచిన వారు, డిపాజిట్ కోల్పోయిన వారి లెక్కలు చూస్తే స్పష్టమవుతున్నది. ఇక, ప్రాంతీయ పార్టీల ప్రభావం పెరగడం వల్ల కూడా ఇండిపెండెంట్ల సంఖ్య తగ్గిపోయిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గతంలో ప్రధాన రాజకీయ పార్టీల నుంచి టికెట్లు లభించని నేతలే స్వతంత్రులుగా ఎక్కువగా పోటీ చేసేవారు. ఇప్పుడు ప్రాంతీయ పార్టీలు ఏర్పడటం, వాటి ప్రభావం కూడా పెరగడం వల్ల టికెట్ ఆశించి భంగపడిన బలమైన నేతలకు ప్రాంతీయ పార్టీలు పిలిచి మరీ టికెట్ ఇస్తున్నాయి.
తెలంగాణ విషయానికి వస్తే 17 సార్లు సార్వత్రిక ఎన్నికలు జరిగితే ఒకే ఒక్కరు స్వతంత్ర అభ్యర్థిగా లోక్సభకు ఎన్నికయ్యారు. 1967 ఎన్నికల్లో నిజామాబాద్ స్థానం నుంచి ఇండిపెండెంట్గా పోటీ చేసిన నారాయణరెడ్డి.. కాంగ్రెస్ అభ్యర్థి హరిశ్చంద్రపై 20,245 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. అంతకుముందు 1962 ఎన్నికల్లో ఇదే నారాయణరెడ్డి ఇండిపెండెంట్గా పోటీ చేసి హరిశ్చంద్రపై 27,020 ఓట్లతో ఓడిపోయారు. 1967 నుంచి ఇప్పటి వరకు తెలంగాణలో ఒక్కరు కూడా స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసి లోక్సభకు ఎన్నికవలేదు.