Madhya Pradesh | (స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, జులై 5(నమస్తే తెలంగాణ): కర్ణాటక 40 శాతం కమీషన్ తరహాలో మధ్యప్రదేశ్లో అక్కడి శివరాజ్సింగ్ చౌహాన్ ప్రభుత్వం 50 శాతం కమీషన్కు తెరలేపింది. బీజేపీ ప్రభుత్వం 40 శాతం కమీషన్ సర్కార్ అంటూ గతంలో కర్ణాటకలో వెలిసిన పోస్టర్ల తరహాలో ‘ఫోన్పే లోగో’తో “50 ఫీసదీ లావో.. ఫోన్ పే.. కామ్ కరావో.. యాక్సెప్టెడ్ మామా” ( 50 శాతం చెల్లించండి, పని చేయించుకోండి) అంటూ క్యూ ఆర్ కోడ్లో సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ బొమ్మతో పోస్టర్లు వెలిశాయి. సీఎం శివరాజ్ సింగ్ను లక్ష్యంగా చేస్తూ ‘శివరాజ్ నహీ, ఘొటాలా రాజ్’ (శివ రాజ్ కాదు మోసాల పాలన) అంటూ మరో రకం పోస్టర్లు రాష్ట్రవ్యాప్తంగా వెలిశాయి. బీజేపీ ప్రభుత్వ అవినీతిపై కాంగ్రెస్ ఏర్పాటు చేసిన ఈ తరహా పోస్టర్లు రాష్ట్రంలో సంచలనంగా మారాయి. కాగా, బీజేపీ కూడా తామేమీ తక్కువ కాదంటూ కాంగ్రెస్ హయాంలో జరిగిన అవినీతిని గుర్తు చేస్తూ అప్పటి సీఎం కమల్నాథ్ ‘కాంటెడ్ కరప్షన్ నా’ అనే పోస్టర్లను రాజధాని భోపాల్లో వేసింది. ఓవైపు కాంగ్రెస్ బీజేపీల మధ్య పోస్టర్ల యుద్ధం కొనసాగుతుండగా, మరోవైపు ఫోన్ పే సంస్థ తమ లోగోను వాడుకోవడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది.
రెండు పారీల అవినీతి పోస్టర్ల గోల సోషల్ మీడియాకు పాకింది. ట్విట్టర్, ఫేస్బుక్, వాట్సాప్లలోనూ ఈ పోరు సాగుతున్నది. కర్నాటకలో బీజేపీని ఓడించిన నేపథ్యంలో కాంగ్రెస్ నాయకులు ఉత్సాహంతో పని చేస్తున్నారు. మరోవైపు రానున్న ఎన్నికలు బీజేపీకి కీలకం కావడంతో బీజేపీ నాయకులు కూడా కాంగ్రెస్ను ధీటుగా ఎదుర్కొనేందుకు ప్రయత్నిస్తున్నారు.
కర్ణాటకలో అవినీతి షురూ
బెంగళూరు : 40 శాతం కమీషన్ బీజేపీని ఓడించామనే సంతోషం కర్ణాటక ప్రజలకు ఎంతోకాలం మిగలలేదు. బీజేపీ స్థానంలో గద్దెనెక్కిన కాంగ్రెస్ సైతం అవినీతిని షురూ చేసింది. ఇటీవల కొలువుదీరిన సిద్ధరామయ్య ప్రభుత్వం అవినీతికి ద్వారాలు తెరిచింది. అధికారుల బదిలీలకు వసూళ్లు చేస్తున్నట్టు ఆ ప్రభుత్వంపై తీవ్రమైన ఆరోపణలు వస్తున్నాయి. యతీంద్ర సిద్ధరామయ్య ట్యాక్స్ (వైఎస్టీ) పేరిట కర్ణాటక సర్కార్ వసూళ్లకు పాల్పడుతున్నదని ఆ రాష్ట్ర మాజీ సీఎం కుమారస్వామి సంచలన ఆరోపణలు చేశారు. ఇంధన శాఖలో అధికారుల బదిలీల కుంభకోణం జరిగిందని ఆయన ఆరోపించారు. కుమారస్వామి ఆరోపణలు రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారాయి. రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారాన్ని రేపాయి. ఈ అంశంపై జేడీఎస్, కాంగ్రెస్ నేతల మధ్య ట్విట్టర్ వార్ నడుస్తున్నది.
రాష్ట్ర ప్రభుత్వం ట్రాన్స్ఫర్ కుంభకోణానికి తెరలేపిందని కుమారస్వామి ఆరోపణలు చేస్తున్నారు. కర్ణాటకలో జూన్ 4న ఇంధన శాఖలోని ఇద్దరు ఉన్నతాధికారుల బదిలీలు జరిగాయి. దీంతో కుమారస్వామి మరోసారి ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ‘ఇంధన శాఖలో ట్రాన్స్ఫర్ బిజినెస్ నడుస్తున్నది. ఒక్కో అధికారి బదిలీకి ప్రభుత్వానికి రూ.10 కోట్లు ముడుతున్నాయి. సదరు అధికారికి రోజుకు రూ.50 లక్షల వరకు కమీషన్ అందుతున్నది. యతీంద్ర సిద్ధరామయ్య ట్యాక్స్ (వైఎస్టీ) పేరిట కర్ణాటక సర్కార్ వసూళ్లకు పాల్పడుతున్నది’ అని పేర్కొన్నారు. ఇంధన శాఖ మంత్రి, ఉపముఖ్యమంత్రి డీకే శిమకుమార్ను టార్గెట్ చేస్తూ కుమారస్వామి ఆరోపణలు చేస్తున్నారు. విద్యా శాఖలో నలుగురు ఉన్నతాధికారులను బదిలీ చేసిన ప్రభుత్వం అదే రోజు ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నది. వైఎస్టీ అందకపోవడంతోనే బదిలీలను వెనక్కి తీసుకున్నారని జేడీఎస్ ట్వీట్ చేసింది.