Parliament | హైదరాబాద్, ఏప్రిల్ 22 (నమస్తే తెలంగాణ): ‘గల్లీల్లో గాయిగత్తర.. పార్లమెంట్లో తత్తరబిత్తర ’ అన్న చందంగా మారింది రాష్ట్రంలోని బీజేపీ, కాంగ్రెస్ ఎంపీల తీరు. ఇటీవల జరిగిన పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో బీఆర్ఎస్ ఎంపీలు కేంద్రాన్ని నిలదీస్తే.. బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించినట్టు పీఆర్ఎస్ (లెజిస్లేటివ్ రిసెర్చ్) విశ్లేషించింది. కేంద్రం నుంచి రాష్ర్టానికి దక్కాల్సిన న్యాయమైన నిధుల వాటా, విభజన చట్టంలో రాష్ర్టానికి కేంద్రం ఇచ్చిన హామీల విషయంలో బీఆర్ఎస్ ఎంపీలు మడమ తిప్పని పోరాటం చేశారని వారు అడిగిన ప్రశ్నల సంఖ్య స్పష్టం చేస్తున్నది. బీజేపీ నలుగురు ఎంపీలు, కాంగ్రెస్ ముగ్గురు ఎంపీలు సమావేశాలకు హాజరు కావటమే తప్ప రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను ఏమాత్రం ప్రతిబింబించలేదని వారి ప్రశ్నల సంఖ్యే తేటతెల్లం చేసింది. ఈ సెషన్లో బీఆర్ఎస్ ఎంపీలు కేంద్ర ప్రభుత్వాన్ని 1,855 ప్రశ్నలు అడిగి ఇరకాటంలో పెట్టారు. బీజేపీ ఎంపీలు 163, కాంగ్రెస్ 680 ప్రశ్నలు మాత్రమే అడిగారు.
జాతిప్రయోజనాల విషయంలో రాజీలేని పోరాటం చేయాలని, రాష్ట్ర హక్కుల సాధన విషయంలో కేంద్రం వైఖరిని ఎండగట్టడంలో వెనుకడుగు వేయకూడదని పార్లమెంట్ సమావేశాల ప్రారంభానికి ముందు బీఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం అయ్యే ముందు జాతిని కుదిపేసిన హిండెన్బర్గ్ నివేదికపై భావసారూప్యతగల పార్టీలతో కలిసి పోరాటం చేయటంలో బీఆర్ఎస్ ముందు నిలిచింది. సమావేశాలు ప్రారంభమైనరోజు నుంచి ముగిసేదాకా రోజూ నిరసన కార్యక్రమాలను చేపడుతూనే కేంద్రంలోని వివిధ మంత్రిత్వశాఖలు తెలంగాణకు కేటాయించిన నిధులు, విభజన హామీలను నెరవేర్చటంలో కేంద్రం వైఖరిని ఎండగట్టడంలో ఎంపీలు క్రీయాశీల పాత్ర పోషించారు. ఎంపీల ప్రాతినిధ్య సరళిని పరిశీలించిన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ నలుగురు ఎంపీలను పురమాయించి కేంద్ర వివక్షను ఎండగట్టాలని ఆదేశించటం వంటి పరిణామాల నేపథ్యంలో బీఆర్ఎస్ ఎంపీలు రాష్ట్ర ప్రయోజనాల విషయంలో కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయటంలో ముందు వరసులో నిలిచారని వారి ప్రశ్నల సంఖ్యే స్పష్టం చేస్తున్నది.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ గల్లీల్లో గాయిగత్తర సృష్టిస్తారే తప్ప పార్లమెంట్లో నోరు విప్పరని మరోసారి నిరూపించారు. బండి సంజయ్ అటెండెన్స్లో 73 శాతం, ధర్మపురి అర్వింద్ అటెండెన్స్ 77 శాతం, సోయం బాపూరావు అయితే 83 శాతం సమావేశాలకు హాజరయ్యారు. కానీ ముగ్గురు కలిసి అడిగిన ప్రశ్నలు 163 మాత్రమే. ఈ ముగ్గురు అడిగిన ప్రశ్నలు బీఆర్ఎస్ ఎంపీల్లో ఒక్కరు అడిగిన ప్రశ్నలకు కూడా సమానం కాకపోవడం గమనార్హం. బండి సంజయ్ 57, అర్వింద్ 77, సోయం బాపూరావు 29 ప్రశ్నలు మాత్రమే అడిగారు. కాంగ్రెస్ ఎంపీలదీ అదే వరుస. ముగ్గురు ఎంపీలు రాష్ట్రం నుంచి లోక్సభలో ప్రాతినిధ్యం వహిస్తున్నా రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా వారు వ్యవహరించలేదని పీఆర్ఎస్ విశ్లేషణను బట్టి స్పష్టమవుతున్నది. పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి 181 ప్రశ్నలు, వెంకట్రెడ్డి 312, ఉత్తమ్కుమార్రెడ్డి 187 ప్రశ్నలు ఇలా మొత్తం 690 ప్రశ్నలను అడిగారు. మొత్తంగా బీఆర్ఎస్ మాత్రమే రాష్ట్ర ప్రజల ప్రయోజనాలకు అనుగుణంగా వ్యవహరించిందని పార్లమెంట్ సమావేశాల సరళి తేటతెల్లం చేసింది.
రంజిత్రెడ్డి 324
కొత్త ప్రభాకర్రెడ్డి 311
మన్నె శ్రీనివాస్రెడ్డి 280
బీబీ పాటిల్ 245
వెంకటేశ్ నేత 210
నామా నాగేశ్వర్రావు 194
పసునూరి దయాకర్ 149
మాలోత్ కవిత 136
పోతుగంటి రాములు 6
బీఆర్ఎస్ 1,855
కాంగ్రెస్ 680
బీజేపీ 163