Sikkim flash floods | ఈశాన్య రాష్ట్రం సిక్కిం (Sikkim)ని ఇటీవల ఆకస్మిక వరదలు అతలాకుతలం చేసిన విషయం తెలిసిందే. వరదలు సంభవించి రెండు వారాలకు పైనే అయినా ఇంకా మృతదేహాల వెలికితీత కొనసాగుతోంది. మంగళవారం మరో రెండు మృతదేహాలను రెస్క్యూ బృందాలు వెలికితీశాయి. ఈ వరదల కారణంగా ఇప్పటి వరకూ మరణించిన వారి సంఖ్య 40కి పెరిగింది.
ఇక అత్యధికంగా మృతదేహాలను పాక్యోంగ్లో స్వాధీనం చేసుకున్నట్లు సిక్కిం స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ తెలిపింది. పాక్యోంగ్ జిల్లా నుండి 26 మృతదేహాలను గుర్తించినట్లు తెలిపింది. ఇందులో 15 మంది పౌరులు కాగా, 11 మృతదేహాలు సైనిక సిబ్బందివి. ఇక మంగన్లో నాలుగు, గ్యాంగ్టక్లో ఎనిమిది, నామ్చిలో రెండు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు వివరించింది.
ఇక ఈ వరదల్లో గల్లంతైన 76 మంది ఆచూకీ ఇప్పటికీ తెలియరాలేదు. పాక్యోంగ్ జిల్లా నుంచి 28, గ్యాంగ్టక్లో 23, మంగన్లో 20, నామ్చిలో ఐదు గురు తప్పిపోయినట్లు అధికారులు వెల్లడించారు. గల్లంతైన వారికోసం రెస్క్యూ బృందాలు వెతుకులాట కొనసాగిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో 20 రిలీఫ్ క్యాంపులు పనిచేస్తున్నాయని.. వాటిలో సుమారు 2,080 మంది ఆశ్రయం పొందుతున్నారని సిక్కిం స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ తెలిపింది.
కాగా, ఈనెల 3వ తేదీన అర్ధరాత్రి దాటిన తర్వాత సిక్కింలో ఆకస్మిక వరదలు సంభవించిన విషయం తెలిసిందే. ఉత్తర సిక్కింలోని లోనాక్ సరస్సు ప్రాంతంలో మంగళవారం అర్ధరాత్రి (3వతేదీ ) సమయంలో కుంభవృష్టి వర్షం కురిసింది. దీంతో లాచెన్ లోయ (Lachen Valley)లోని తీస్తా నది ( Teesta River)కి భారీగా వరద వచ్చి చేరడంతో నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. దీంతో నది బేసిన్లో అర్ధరాత్రి దాటిన తర్వాత 1:30 గంటల ప్రాంతంలో ఆకస్మిక వరదలు సంభవించాయి. ఈ వరదలకు సుమారు లక్ష మంది ప్రజలు ప్రభావితమయ్యారు.
Also Read..
Twitter | యూజర్లకు షాక్ ఇచ్చిన ట్విట్టర్.. ఇకపై పోస్ట్ పెట్టాలంటే డబ్బు కట్టాల్సిందే
Kundara Johny | చిత్ర పరిశ్రమలో విషాదం.. గుండెపోటుతో ప్రముఖ నటుడు మృతి
BRS leader | కేసీఆర్ కుటుంబాన్ని విమర్శిస్తే సహించం.. ఎంపీ అర్వింద్కు ఎఫ్డీసీ చైర్మన్ హెచ్చరిక