నిజామాబాద్: ఎంపీ అరవింద్ కుమార్ హద్దు మీరి ప్రవర్తిస్తున్నారని, ముఖ్యమంత్రి కేసీఆర్ పైన, మంత్రి కేటీఆర్ పైన, ఎమ్మెల్సీ కవితపైన వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని ఎఫ్డీసీ ఛైర్మన్ అనిల్ కూర్మాచలం మండిపడ్డారు. ఎమ్మెల్యే కవితపై ఎంపీ అర్వింద్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు.
ఎంపీగా గెలిచి నాలుగు సంవత్సరాల నుంచి నిజామాబాద్ ప్రజలకు అర్వింద్ చేసిందేమి లేదని, కానీ రోజురోజుకి కేసీఆర్ కుటుంబంపై ఇష్టానుసారంగా వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని అనిల్ కూర్మాచలం ఆరోపించారు. ఇటీవల ప్రజల కోసం తీసుకొచ్చిన భీమా పథకాన్ని విమర్శిస్తూ కేసీఆర్ కుటుంబ సభ్యులు చావాలనడం దారుణమన్నారు. ఇది అర్వింద్లోని ఉన్మాదాన్ని తెలియజేస్తుందని విమర్శించారు. ఇలాగే ప్రవర్తిస్తే రానున్న రోజుల్లో ప్రజలు చెప్పులతో సమాధానం చెప్తారని హెచ్చరించారు.