చంఢీఘఢ్ : పంజాబ్లో ఆప్ సీఎం అభ్యర్ధిపై నిర్వహించిన సర్వేను రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ తప్పుపట్టారు. ఈ సర్వే అంతా ఓ స్కామ్ అని దుయ్యబట్టిన సిద్ధూ కేజ్రవాల్ భ్రమలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. సర్వే కోసం ఆప్ ఉపయోగించిన మొబైల్ నంబర్ సాధారణ నెంబర్ అని కమర్షియల్ కాదని సిద్ధూ పేర్కొన్నారు. ఈ నెంబర్కు 21,59,437 స్పందనలు వచ్చాయని ఆప్ చెబుతున్న మాటలు బూటకమని సిద్ధూ కొట్టిపారేశారు.
సాధారణ మొబైల్ నెంబర్ కేవలం నాలుగు రోజుల్లో 21 లక్షల కాల్స్, ఎస్ఎంఎస్లను రికార్డు చేయలేదని ఆయన వివరించారు. ఏడు లక్షల వాట్సప్ మెసేజ్లు వచ్చాయని ఆప్ నేతలు చెబుతున్నారని ఆ పార్టీ పంజాబీలను మోసపుచ్చేందుకు ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. సీఎం అభ్యర్ధి పేరుతో ఆప్ నాటకం ప్రజల ముందు బయటపడిందని సిద్ధూ ఆరోపించారు.
ఇక మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్తో కాషాయ పార్టీ పొత్తు ఖరారు కాగా తాజాగా సీట్ల సర్ధుబాటు ప్రక్రియను పూర్తిచేశారు. పొత్తులో భాగంగా కెప్టెన్ సింగ్ నేతృత్వంలోని పంజాబ్ లోక్ కాంగ్రెస్ 35 స్ధానాల్లో పోటీ చేయనుండగా, సుఖ్ధేవ్ సింగ్ ధిండ్సా నేతృత్వంలోని శిరోమణి అకాలీదళ్ (సంయుక్త్) 15 స్ధానాల్లో బరిలో దిగనుంది. బీజేపీ 65 స్ధానాల్లో పోటీ చేయనుంది. ఇక ఫిబ్రవరి 20న ఒకే దశలో పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా మార్చి 10న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటించనున్నారు.