లక్నో: పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ నిరాహార దీక్షను శనివారం విరమించారు. లఖింపూర్ ఖేరీలో ఆదివారం నిరసన చేస్తున్న రైతులపైకి కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడి వాహనం దూసుకెళ్లింది. ఈ ఘటనతో పాటు అనంతరం జరిగిన ఆందోళనలో 8 మంది చనిపోయారు. మృతుల్లో నలుగురు రైతులు, ఒక జర్నలిస్ట్, మరో ముగ్గురు ఉన్నారు.
ఈ నేపథ్యంలో బీజేపీకి వ్యతిరేకంగా పంజాబ్లోని మొహాలీ నుంచి ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ ఖేరీకి గురువారం చేపట్టిన భారీ కాంగ్రెస్ ర్యాలీకి సిద్ధూ నేతృత్వం వహించారు. పలు వాహనాల్లో వచ్చిన పంజాబ్ కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర నేతలు, కార్యకర్తలను యూపీ పోలీసులు సరిహద్దులో అడ్డుకున్నారు. సిద్ధూను అదుపులోకి తీసుకున్నారు.
ఈ సందర్భంగా సిద్ధూ యూపీ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. శుక్రవారంలోగా నిందితులను అరెస్ట్ చేయకపోతే నిరాహార దీక్ష చేస్తానని హెచ్చరించారు. దీంతో చివరకు సిద్ధూతోపాటు కాంగ్రెస్ నేతలను లఖింపూర్ ఖేరీకి పోలీసులు అనుమతించారు.
దీంతో లఖింపూర్ఖేరీ ఘటనలో మరణించిన రైతుల కుటుంబాలను సిద్ధూ శుక్రవారం పరామర్శించారు. అనంతరం జర్నలిస్ట్ రామన్ కశ్యప్ కుటుంబం ఉండే నిగసస్కు చేరుకున్నారు. ఆ జర్నలిస్ట్ కుటుంబాన్ని పరామర్శించిన ఆయన ఆ ఇంటి వద్ద నిరాహార దీక్షకు దిగారు. నిందితులను పోలీసులు అరెస్ట్ చేసే వరకు దీక్షను కొనసాగిస్తానని సిద్ధూ తెలిపారు.
అయితే లఖింపూర్ ఖేరీ ఘటనలో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా శనివారం లఖింపూర్ ఖేరీ క్రైం బ్రాంచ్ కార్యాలయంలో హాజరయ్యారు. ఈ నేపథ్యంలో సిద్ధూ తన నిరాహార దీక్షను విరమించారు.