Siddu | ప్రధాని మోదీ పర్యటనలో భద్రతాపరమైన లోపాలున్నాయన్న బీజేపీ ఆరోపణలపై పంజాబ్ పీసీసీ అధ్యక్షుడు సిద్దూ ఘాటుగా స్పందించారు. ప్రధాని మోదీ సభకు ప్రజలెవ్వరూ రాలేదని, అందుకే భద్రతా లోపం అంటూ తమపై విమర్శలకు దిగుతున్నారని దుయ్యబట్టారు. సభకు హాజరు కావడానికి ప్రజలు విముఖత చూపించారని, దీనిని డైవర్ట్ చేయడానికే ఇలాంటి విమర్శలకు దిగుతోందన్నారు.
కేంద్రం తీసుకొచ్చిన సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు సంవత్సరం పాటు నిరసనలను చేపట్టారని, కానీ… ఓ 15 నిమిషాలు వేచిఉన్నందుకు మాత్రం కష్టంగా మారిందా? అంటూ సిద్దూ సూటిగా ప్రశ్నించారు. ఇంత ద్వంద్వ ప్రమాణాలు ప్రధానిగా తగునా? అంటూ నిలదీశారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని మోదీ హామీ ఇచ్చారని, కానీ ఏమైందని సిద్దూ ఎద్దేవా చేశారు.