బెంగళూర్ : దేశ ఆర్ధిక వ్యవస్ధను ప్రధాని నరేంద్ర మోదీ నాశనం చేశారని కర్నాటక సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధరామయ్య (Siddaramaiah )ఆరోపించారు. అనాలోచిత నిర్ణయాలు, అపరిపక్వ విధానాలతో ఆర్ధిక వ్యవస్ధను ఛిన్నాభిన్నం చేసింది మోదీ సర్కారేనని, ప్రతిపక్షాలు కాదని స్పష్టం చేశారు. బెంగళూర్లో మంగళవారం జరగనున్న విపక్ష భేటీ సందర్భంగా సిద్ధరామయ్య ఈ వ్యాఖ్యలు చేశారు.
అంతకుముందు ఈ సమావేశానికి హాజరయ్యేందుకు నగరానికి చేరుకున్న కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ, పార్టీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గేలకు సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సహా పలువురు పార్టీ నేతలు స్వాగతం పలికారు. ఇక బెంగళూర్లో మంగళవారం 20 పార్టీలకు పైగా పాల్గొనే విపక్షాల మెగా భేటీలో (Opposition Meet) యూపీఏ పేరు మార్పు దిశగా నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నారు. విపక్ష సంకీర్ణం పేరు మార్పుపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ మాట్లాడుతూ ఈ అంశంపై కాంగ్రెస్ పార్టీ స్వయంగా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని దీనిపై విపక్ష భేటీలో సమిష్టి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని అన్నారు.
విపక్ష పార్టీలన్నీ యూపీఏ పేరు మార్పుపై విస్తృతంగా చర్చించి ఈ భేటీలోనే ఓ నిర్ణయం తీసుకుంటాయని చెప్పారు. బీజేపీ వ్యతిరేక కూటమి కనీస ఉమ్మడి కార్యక్రమాన్ని ఖరారు చేయడంతో పాటు రాష్ట్రాల వారీగా సీట్ల సర్ధుబాటుపైనా ఈ సమావేశంలో చర్చలు జరుపుతారు.కనీస ఉమ్మడి కార్యక్రమాన్ని రూపొందించేందుకు ఓ సబ్ కమిటీని ఏర్పాటు చేసే అవకాశం ఉంది. వచ్చే సార్వత్రిక ఎన్నికలకు విపక్షాలను ఏకం చేసే దిశగా అవసరమైన వ్యూహాలను ఖరారు చేస్తారు. విపక్షాలు ఉమ్మడిగా ప్రచార కార్యక్రమాన్ని చేపట్టేందుకు అవసరమైన కార్యాచరణ కోసం మరో సబ్ కమిటీ ఏర్పాటు కానుంది. ఈవీఎంలు, ఎన్నికల సంస్కరణలపైనా ఈ సమావేశంలో విపక్షాలు చర్చించనున్నాయి. ఇక కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే స్వాగతోపన్యాసంతో మంగళవారం విపక్షాల సమావేశం ప్రారంభం కానుండగా తొలి రోజు భేటీ అనంతరం సాయంత్రం నాలుగు గంటలకు సంయుక్త విలేకరుల సమావేశం ఉంటుందని పార్టీ వర్గాలు తెలిపాయి.
Read More :