బెంగళూర్ : చంద్రుడి దక్షిణ ధ్రువంలోకి చంద్రయాన్-3 (Chandrayaan-3 Success) సేఫ్ ల్యాండింగ్ విజయవంతంగా పూర్తవడంతో దేశవ్యాప్తంగా సంబరాలు మిన్నంటాయి. మూన్ మిషన్ సక్సెస్ కావడంతో కర్నాటక సీఎం సిద్ధరామయ్య గురువారం ఇస్రో చీఫ్ ఎస్. సోమనాధ్ను సన్మానించారు. ఇస్రో సెంటర్ను సందర్శించిన సిద్ధరామయ్య అక్కడి శాస్త్రవేత్తలు, అధికారులు, సిబ్బందిని అభినందించారు.
మూన్ మిషన్ విజయవంతమవడంతో మన దేశం చారిత్రక విజయం సాధించిందని, చంద్రుడి దక్షిణ ధ్రువంలో కాలుమోపిన తొలి దేశంగా భారత్ అరుదైన ఘనతను సాధించిందని సిద్ధరామయ్య విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు. జాబిల్లిపై కాలుమోపడం చిన్న విషయం కాదని, ఇది అసాధారణ విజయమని ఆయన అన్నారు. ఇస్రో ఎన్నో ఏండ్లుగా ఈ మిషన్పై కసరత్తు సాగిస్తోందని, 500 మంది శాస్త్రవేత్తలు దీనిపై పనిచేశారని చెప్పారు. బెంగళూర్లోని విధాన సౌధలో ఇస్రో చైర్మన్ సోమనాధ్ సహా శాస్త్రవేత్తలందరినీ సన్మానిస్తామని సీఎం వెల్లడించారు.
ఈ ప్రత్యేక సందర్భంలో దేశానికి అద్భుత విజయాన్ని అందించిందన సోమనాధ్తో పాటు ఆయన బృంద సభ్యులందరినీ అభినందిస్తున్నానని సీఎం పేర్కొన్నారు. చంద్రయాన్ మిషన్ విజయానికి కారకులైన వారిని గౌరవించడం గర్వంగా ఫీలవుతున్నామని కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఇస్రో శాస్త్రవేత్తల కృషిని కొనియాడారు. భారత శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఇది అద్భుత క్షణమని, ఇది భారత శాస్త్ర సాంకేతిక రంగంలో చారిత్రాత్మక ఘట్టమని అన్నారు. భారత్ ప్రపంచ విజ్ఞాన రాజధానిగా సత్తా చాటిందని అన్నారు. రాబోయే తరాలు ఈ ప్రగతిని ముందుకు తీసుకువెళతాయని ఆయన ఆకాంక్షించారు.
Read More :
Chandrayaan-3 | చంద్రయాన్-3 సక్సెస్లో రామగుండం వాసి