బెంగళూర్ : వరద బాధితులను పరామర్శించేందుకు కొడగు పర్యటనకు వెళ్లిన కర్నాటక మాజీ సీఎం, విపక్ష నేత సిద్ధరామయ్య వాహనానికి నల్ల జెండాలు చూపుతూ కాన్వాయ్పై కోడిగుడ్లు విసిరిన ఘటన నేపధ్యంలో కాంగ్రెస్ నేత కీలక వ్యాఖ్యలు చేశారు. గాంధీని చంపిన వీరు తనను బతకనిస్తారా అని ప్రశ్నించారు.
గాంధీని కాల్చిచంపిన గాడ్సే ఫోటోను బీజేపీ శ్రేణులు పూజిస్తున్నాయని మండిపడ్డారు. కొడగు పర్యటనలో బీజేపీ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేస్తూ గో బ్యాక్ సిద్ధరామయ్య అంటూ నినాదాలు చేశారు. మాజీ సీఎం కారుపై కొందరు కోడిగుడ్లు విసరడంతో పాటు సిద్ధరామయ్య పైకి సావర్కర్ ఫోటోను విసిరివేశారు.
ఇక సిద్ధరామయ్య వ్యాఖ్యలపై కర్నాటక హోంమంత్రి అరగ జ్ఞానేంద్ర స్పందిస్తూ ఎవరైనా నిరసన తెలపవచ్చని, కానీ చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే సహించబోమని హెచ్చరించారు. సిద్ధరామయ్యకు తగినంత భద్రత కల్పించాలని పోలీసు అధికారులను ఆదేశించామని చెప్పారు. రాజకీయ లబ్ధి కోసమే సిద్ధరామయ్య ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారని, ఆయనపై ఎవరూ దాడి చేయరని, హత్యా యత్నం చేయరని అన్నారు. పోలీసు అధికారులు ఆయనకు తగిన భద్రత కల్పిస్తారని హోంమంత్రి హామీ ఇచ్చారు.