ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని వారణాసిలోగల కాశీ విశ్వనాథ దేవాలయం పసిడి వర్ణంలో మెరిసిపోతున్నది. ఓ అజ్ఞాత భక్తుడు విరాళంగా ఇచ్చిన 60 కిలోల బంగారంతో పసిడి వర్ణంలోకి మారిపోతున్నది. 23 కిలోల బంగారం ఉపయోగించి ఆలయ శిఖర గోపురం, తలుపు ఫ్రేమ్ల దిగువ భాగంలో బంగారు పూత పూశారు.
దిగువ గోపురం, లోపలి గోడలు, పైకప్పుకు బంగారు పూత పూసే పనులు మార్చిలో ప్రారంభమై మంగళవారంతో ముగిశాయి. 18వ శతాబ్దానికి చెందిన ఈ శివాలయం అందంగా రూపుదిద్దుకుంటోంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
డిసెంబర్ 13, 2021న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. కాశీ విశ్వనాథ్ ధామ్ (కారిడార్) ప్రారంభోత్సవానికి నెల ముందు..ఒక దాత ఆలయ అధికారులను సంప్రదించి 60 కిలోల బంగారాన్ని విరాళంగా ఇచ్చారు. ఆలయ గర్భగుడి లోపల బంగారు తాపడం చేసేందుకు ఇందులోంచి 37 కిలోల బంగారాన్ని వినియోగించారు. గతేడాది కాశీ విశ్వనాథ్ ధామ్ ప్రాజెక్ట్ను లాంఛనంగా ప్రధాని మోదీ ప్రారంభించిన వెంటనే ఈ పనులు కూడా షురూ అయ్యాయి.
గర్భగుడి లోపల పని పూర్తైన తర్వాత, మిగిలిన 23 కిలోల బంగారాన్ని ఆలయంలోని బంగారు గోపురాల దిగువ భాగాన్ని, తలుపు ఫ్రేమ్లను కవర్ చేసేందుకు ఉపయోగించారు. ఆలయం లోపలి భాగంలో బంగారు పూత పూసేందుకు గుజరాత్, ఢిల్లీ నుంచి ప్రత్యేక బృందాన్ని పిలిపించారు. ఈ కాశీ విశ్వనాథ ఆలయాన్ని ఇండోర్ మహారాణి అహల్యాబాయి హోల్కర్ 1777లో నిర్మించారు. మహారాజా రంజిత్ సింగ్ విరాళంగా ఇచ్చిన సుమారు ఒక టన్ను బంగారంతో దాని రెండు గోపురాలకు మొదటిసారి బంగారు పూత పూశారు.