Shree Ram sena | (స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, మే 7 (నమస్తే తెలంగాణ): మోదీ పేరు చెప్పి ఓట్లు అడిగే బీజేపీ నేతలను చెప్పుతో కొట్టాలంటూ కర్ణాటక శ్రీరామసేన అధినేత ప్రమోద్ ముతాలిక్ ఆ రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం వంద శాతం అవినీతిలో కూరుకుపోయిన మాట వాస్తవమని అన్నారు. ఉడిపి జిల్లా కర్కల అసెంబ్లీ స్థానం నుంచి బీజేపీ తరఫున బరిలో నిలిచిన రాష్ట్ర మంత్రి సునీల్కుమార్పై పోటీచేస్తున్న ప్రమోద్ ముతాలిక్ ‘న్యూస్ ల్యాండ్రీ’ వెబ్న్యూస్కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆరెస్సెస్తో తమ సంస్థకున్న సంబంధాలు, బీజేపీ, కాంగ్రెస్ ఎన్నికలపై పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ప్రభుత్వం పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిందని, రోడ్లు, దవాఖానలు వంటి మౌలిక సదుపాయాలను నిర్లక్ష్యం చేసిందన్నారు. బీజేపీలో ప్రస్తుతం 70 శాతం కాంగ్రెస్వారే ఉండటంతో ఆ పార్టీకి తాను దూరమైనట్టు వివరించారు.
కాంగ్రెస్ మైనార్టీల ఓట్ల కోసం కుహనా లౌకికవాదంతో ఇస్లామిక్ తీవ్రవాదాన్ని పెంచి పోషించిందని ముతాలిక్ అన్నారు. కాంగ్రెస్ హయాంలో గో హత్యలు, మత మార్పిడులు, మదర్సాల నిర్మాణం, లవ్ జిహాద్ను పెంచి పోషించిందని తెలిపారు. పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ)ముసుగులో ఇస్లామిక్ తీవ్రవాద విస్తరణ కాంగ్రెస్ హయాంలోనే బలపడిందన్నారు. 137 మంది పీఎఫ్ఐ కార్యకర్తలపై పెట్టిన కేసులను సిద్ధరామయ్య సర్కార్ ఎత్తేసిందని చెప్పారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన బీజేపీ కూడా ఆ కేసుల గురించి పట్టించుకోలేదని వెల్లడించారు.
భజరంగ్దళ్ ఉగ్రవాద సంస్థ కాదని, దేశభక్తి కలిగిన ధార్మిక సంస్థ అని ముతాలిక్ చెప్పుకొచ్చారు. అలాంటప్పుడు భజరంగ్దళ్ను నిషేధిస్తామని కాంగ్రెస్ ఎలా అంటుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ హిందువుల విరోధ పార్టీగా మారిందని మండిపడ్డారు. అసాంఘిక కార్యకలాపాలపై ప్రభుత్వం పట్టించుకోనందునే శ్రీరామసేన దాడులు చేసిందన్నారు.
బెంగళూరు : రాజకీయ పార్టీలు, నేతలు, సంస్థలు ఇచ్చే ప్రకటనలకు సంబంధించి పలు నిబంధనలు విధిస్తూ భారత ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ (ఎంసీఎంసీ) ముందుగా ప్రకటన సారాంశాన్ని ఆమోదించకుండా రాజకీయ పార్టీలు, అభ్యర్థులు, సంస్థలు పోలింగ్ రోజున కానీ, పోలింగ్ ముందు రోజు కానీ ప్రింట్ మీడియాలో రాజకీయ ప్రకటనలు జారీ చేయరాదని ఆదేశించింది. ‘పోలింగ్ రోజున ప్రకటన ఇవ్వాలనుకునేవారు రెండు రోజుల ముందు, పోలింగ్కు ముందు ఇవ్వాలనుకునే వారు ఒక రోజు ముందు ఎంసీఎంసీని సంప్రదించాలి. ప్రింట్ మీడియాలో ఇచ్చిన ప్రకటనల ద్వారా కొందరు వ్యక్తులు, పార్టీల మనోభావాలు దెబ్బతినడం, తప్పుదోవ పట్టించేలా ప్రకటన సారాంశం ఉండటం గతంలో చోటుచేసుకున్నాయి. దానిని దృష్టిలో ఉంచుకుని అలాంటి అవాంఛనీయ పరిస్థితులను నిరోధించడానికే ఈ నిబంధనను తీసుకువచ్చాం’ అని ఎన్నికల సంఘం వివరించింది.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు జరుగుతున్న హోరాహోరీ ప్రచారానికి సోమవారంతో తెరపడనున్నది. మే 10న పోలింగ్, 13న కౌంటింగ్ జరిగే ఈ ఎన్నికలకు ప్రధాన పార్టీలు మూడూ నువ్వా? నేనా? అన్న రీతిలో ప్రచారం సాగించాయి. లింగాయత్ల ఫోరం ఈ ఎన్నికల్లో కాంగ్రెస్కు మద్దతు తెలిపింది. 224 సభ్యులున్న శాసనసభలో అధికారం చేపట్టడానికి కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 113. కర్ణాటకలో అధికారంలో ఉన్న పార్టీ తదుపరి ఎన్నికల్లో నెగ్గిన దాఖలాలు గత 38 ఏండ్లుగా లేవు.