హైదరాబాద్, డిసెంబర్ 2 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రులను మార్చడంలో బీజేపీ.. కాంగ్రెస్ దారిలోనే వెళ్తున్నది. కర్ణాటక సీఎంను మళ్లీ మార్చేందుకు యోచిస్తున్నది. నాలుగు నెలల కిత్రం యెడియూరప్పను బలవంతంగా సీఎం పీఠం నుంచి దించేసి బసవరాజ్ బొమ్మైని సీఎం చేసింది. గుర్రుగా ఉన్న యెడియూరప్ప రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీ ఏర్పాటు చేయనున్నట్టు సంకేతాలు పంపించారు. దీంతో బీజేపీ అధిష్టానం యెడ్డీని నిలువరించేందుకు వ్యూహాలు రచిస్తున్నది. ఇందులో భాగంగానే బొమ్మై స్థానంలో కొత్త సీఎంగా కేంద్ర వ్యవసాయశాఖ సహాయ మంత్రి శోభా కరంద్లాజేను నియమించాలని భావిస్తున్నది. శోభా కరంద్లాజే యెడియూరప్పకు సన్నిహితురాలు కావడమే ఇందుకు ప్రధాన కారణం. శోభ గతంలో యెడ్డీ మంత్రివర్గంలో పనిచేశారు.