Shiv Sena | కేంద్రంలోని మోదీ ప్రభుత్వంపై ఉద్ధవ్ బాలా సాహెబ్ థాకరే శివసేన తీవ్ర విమర్శలు గుప్పించింది. ఉద్ధవ్ వర్గం మౌత్ పీస్ సామ్నాలో బీజేపీని అవినీతి వాషింగ్ మెషీన్ అని అభివర్ణించింది. కేంద్రం నిరంకుశ పద్ధతిలో పాలిస్తుందని ధ్వజమెత్తింది. ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలు ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాసిన విషయం తెలిసిందే. 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతిపక్ష నేతలపై అణిచివేతలు ఎలా పెరిగిపోయాయో లేఖలో ప్రస్తావించారు.
అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న నేతలు బీజేపీలో చేరిన వెంటనే వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్న విషయాన్ని గుర్తు చేశారు. ఈ క్రమంలో సామ్నా ప్రత్యేక వ్యాసాన్ని ప్రచురించింది. దేశంలో ప్రస్తుతం అరాచక పరిస్థితి నెలకొందని మండిపడింది. స్వయం ప్రతిపత్తి గల ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తున్నారని.. ఇది అల్ఖైదా, తాలిబాన్ల కంటే ప్రమాదకరమని పేర్కొంది. రాహుల్ను ఉద్దేశించి బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలపై ఘాటుగానే స్పందించింది.
రాహుల్ గాంధీ దేశం పరువు తీస్తుంటే.. ప్రధాని మోదీ విదేశాలకు వెళ్లిన సమయంలో ఇందిరా గాంధీ, పండిట్ జవహర్లాల్ నెహ్రూ, రాజీవ్ గాంధీ ప్రభుత్వాల నిర్ణయాలను విమర్శించి దేశం పరువు తీయలేదా? అని ప్రశ్నించింది. కోట్లాది రూపాయలు డిపాజిట్ చేసి ఆ డబ్బును అదానీ గ్రూప్లో ఇన్వెస్ట్ చేశారని, ప్రస్తుత ప్రభుత్వం అత్యంత అవినీతి ప్రభుత్వంగా ఉద్ధవ్ నేతృత్వంలోని శివసేన అభివర్ణించింది. బెంగళూరులో బీజేపీ ఎమ్మెల్యే కుమారుడు రూ.8కోట్ల లంచం తీసుకుంటూ లోకాయుక్త పోలీసులకు చిక్కిన విషయాన్ని ప్రస్తావించింది. అక్కడ సీబీఐ, ఈడీ ఎక్కడా కనిపించలేదని, ఆ పార్టీ నేతలెవరూ మాట్లాడడం లేదని నిలదీసింది.