Lok Sabha Elections : మహారాష్ట్రలోని మహాకూటమిలో సీట్ల సర్దుబాటు పూర్తయ్యింది. ఈ లోక్సభ ఎన్నికల్లో ఎవరెన్ని స్థానాల్లో పోటీ చేయాలనే విషయంలో శివసేన (ఉద్ధవ్ థాకరే వర్గం), ఎన్సీపీ (శరద్పవార్ వర్గం), కాంగ్రెస్ పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదిరింది. ఈ మేరకు మహాకూటమి నేతలు ఉమ్మడి ఒక ప్రకటన చేశారు. మొత్తానికి 21-17-10 ఫార్ములాను ఫైనల్ చేసినట్లు తెలిపింది.
మహాకూటమి ప్రకటన ప్రకారం.. ఉద్ధవ్ థాకరే వర్గం శివసేన అత్యధికంగా 21 స్థానాల్లో బరిలో దిగుతోంది. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ 17 స్థానాల్లో పోటీ చేయనుంది. ఇక శరద్పవార్ వర్గం ఎన్సీపీ 10 స్థానాల్లో పోటీ పడనుంది. ఇన్నాళ్లు సాంగ్లీ లోక్సభ స్థానం కోసం ఉద్ధవ్ శివసేన, కాంగ్రెస్ పోటీపడ్డాయి. సాంగ్లీలో మాకు పట్టుందని, ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారని, కాబట్టి ఆ స్థానంలో మా అభ్యర్థే పోటీలో ఉండాలని కాంగ్రెస్ వాదిస్తూ వచ్చింది.
కానీ ఉద్ధవ్ శివసేన అందుకు ససేమిరా అంది. సాంగ్లీ స్థానం తమకే కావాలని పట్టుబట్టింది. ఎట్టకేలకు కాంగ్రెస్ మెట్టుదిగడంతో సర్దుబాటు ఫైనల్ అయ్యింది. దాంతో సాంగ్లీ నుంచి శివసేన (యూబీటీ).. రెజ్లర్ చంద్రహార్ పాటిల్ను తమ అభ్యర్థిగా ప్రకటించింది. అయితే అంతకుముందు కాంగ్రెస్ పార్టీ మాజీ ముఖ్యమంత్రి వసంత్దాదా పాటిల్ మనవడు విశాల్ పాటిల్ను సాంగ్లీ అభ్యర్థిగా ఖరారు చేసింది.
ఇప్పుడు సాంగ్లీ సీటు పొత్తులో భాగంగా శివసేనకు వెళ్లడంతో స్థానిక కాంగ్రెస్ నేతలు ఢిల్లీకి వెళ్లి హైకమాండ్ను కలిశారు. విశాల్ పాటిల్ను పార్టీ అభ్యర్థిగా ప్రకటించి వెనక్కి తగ్గడంతో పార్టీ శ్రేణుల్లో నిరుత్సాహం నెలకొందని తెలిపారు. దాంతో విశాల్ పాటిల్ను రాజ్యసభకు పంపిస్తామని కాంగ్రెస్ హైకమాండ్ హామీ ఇచ్చింది. దాంతో సమస్య సద్దుమణిగింది.