Sanjay raut | ముంబై: మహారాష్ట్రలోని ఏక్నాథ్ షిండే ప్రభుత్వానికి డెత్ వారెంట్ జారీ అయ్యిందని, వచ్చే 15-20 రోజుల్లో అది కూలిపోవడం ఖాయమని శివసేన (యూబీటీ) నేత, రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ జోస్యం చెప్పారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తిరుగుబాటు చేసిన 16 మంది శివసేన ఎమ్మెల్యేల అనర్హత కేసుకు సంబంధించి కోర్టు ఉత్తర్వుల కోసం చూస్తున్నామని, ఈ విషయంలో తమకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నట్టు చెప్పారు. ‘మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, ఆయన 40 మంది ఎమ్మెల్యేల ప్రభుత్వం 15-20 రోజుల్లో కుప్పకూలుతుంది.
ఈ ప్రభుత్వానికి ఇప్పటికే డెత్ వారెంట్ జారీ అయ్యింది. అయితే ఆ వారెంట్పై ఎవరు సంతకం పెడతారన్నది ఇప్పుడు నిర్ణయమవుతుంది’ అని ఆయన వ్యాఖ్యానించారు. ఇటీవల పరిణామాలలో ఎన్సీపీ నేత అజిత్ పవార్కు సీఎం పగ్గాలప్పగించడానికి బీజేపీ ప్రయత్నిస్తున్నదని, తద్వారా ఎన్సీపీలో సైతం చీలిక తేవాలన్నది ఆ పార్టీ వ్యూహంగా కనిపిస్తున్నదని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో షిండే ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని సంజయ్ రౌత్ వ్యాఖ్యానించారు.